ఘోరం: కాపురానికి రానందని నడిరోడ్డుపై భార్య గొంతుకోశాడు
కాపురానికి రావడం లేదన్న కోపంతో కట్టుకున్న భార్య గొంతుకోసి చంపేశాడు ఓ కర్కశపు భర్త. అంతేగాక, అడ్డుకోబోయిన ఆమె తండ్రి, సోదరుడిపై కూడా దాడి చేశాడు.
హైదరాబాద్: కాపురానికి రావడం లేదన్న కోపంతో కట్టుకున్న భార్య గొంతుకోసి చంపేశాడు ఓ కర్కశపు భర్త. అంతేగాక, అడ్డుకోబోయిన ఆమె తండ్రి, సోదరుడిపై కూడా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన నగరంలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత(27), ఈశ్వర్ దంపతులు బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. నవంబర్ 5న కోడలు కన్పించడంలేదంటూ అత్త చంద్రమ్మ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇష్టం లేకే..
మంగళవారం సాయంత్రం కవిత.. తండ్రి సత్యనారాయణ, సోదరుడు పవన్తో కలిసి బేగంపేట పోలీస్స్టేషన్కు వచ్చింది. తాను ఎక్కడికీ వెళ్లలేదని, భర్తతో ఉండటం ఇష్టంలేక మియాపూర్లోని పుట్టింటికి వెళ్లానని తెలిపింది. అనంతరం పోలీసులు భర్త ఈశ్వర్ను కూడా పిలిపించారు. ఇద్దర్నీ విచారించారు. అప్పుడు కూడా భర్తతో కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని, తల్లిదండ్రుల వద్దనే ఉంటానని కవిత తేల్చిచెప్పింది.
గొంతుకోశాడు
అనంతరం ముగ్గురూ మియాపూర్లోని ఇంటికి వెళ్లేందుకు ప్రకాష్నగర్ బస్టాపులో బస్సు కోసం ఎదురుచూశారు. బస్సు రాకపోవడంతో ఆటో ఎక్కారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఈశ్వర్ ఆటోలో ఉన్న కవితను బయటకు లాగి వెంట తెచ్చుకున్న హెక్సాబ్లేడుతో గొంతు కోశాడు.
తండ్రి, సోదరుడిపైనా దాడి..
అడ్డుకునేందుకు యత్నించిన ఆమె తండ్రి, సోదరుడిపైనా దాడి చేసి పరారయ్యాడు. కవితను హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయపడిన సత్యనారాయణ, పవన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కవితను హత్య చేసి, పరారీలో ఉన్న నిందితుడు ఈశ్వర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.