భార్యను రూ. 60 వేలకు అమ్మేశాడు: పిల్లలను రోడ్డుపై వదిలేశాడు
నిజామాబాద్: ఆరేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డబ్బుకు ఆశపడి ఓ ప్రబుద్ధుడు భార్యను అమ్మేశాడు. ఏడాది కిందటే ఈ ఘటన జరిగింది. అయితే తన వెంట తీసుకెళ్లిన పిల్లలను అతను వదిలేయడంతో తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గురువారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన రాజు ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఏడాది కిందట రాజు తన భార్యను బాన్సువాడకు చెందిన మల్లయ్య అనే వ్యక్తికి రూ.60 వేలకు అమ్మాడు. కొంతకాలానికే మహిళ తల్లిదండ్రులు ఆ డబ్బు ఇచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. తర్వాత ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది.
ఇద్దరు పిల్లలతో మెదక్ జిల్లాకు వెళ్లిన రాజు, మేనకోడలిని పెండ్లి చేసుకున్నాడు. ఇటీవల మేనకోడలు మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లల బాగోగులు చూడడం భారంగా అతనికి భారంగా మారింది. దీంతో రాజు వాళ్లను బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చి రోడ్డుపై వదిలివెళ్లాడు. పిల్లలు తల్లి దగ్గరకు చేరడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ప్రశ్నించగా విడాకులు ఇచ్చినా, భర్తపై పోలీసులకు ఫిర్యా దు చేయడానికి ఆమె అంగీకరించలేదు. తమ కులంలో భార్యను విక్రయించడం తప్పుకాదని, పోలీసులను ఆశ్రయిస్తే కుల పెద్దలు తప్పు పడుతారని ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు.