తెలంగాణలోనూ కరోనాకు నాటు మందు-తెర పైకి నాటు వైద్యుడు భీమయ్య-రెండే గంటల్లో నయం చేస్తానని
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా విరుగుడు పేరుతో ఇస్తున్న నాటు మందుపై ఓ పక్క పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి... మరో పక్క తామూ కరోనాకి మందు తయారుచేశామని మరికొందరు 'ఆనందయ్య'లు ముందుకొస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి,పులివెందుల తదితర ప్రాంతాల్లో కరోనా మందు పేరుతో కొందరు వ్యక్తులు పసరు మందు పంపిణీ చేస్తున్నారు.తాజాగా తెలంగాణలోనూ ఓ నాటు వైద్యుడు తాను కరోనాకు విరుగుడు మందు ఇస్తున్నానని చెబుతున్నాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కరోనా విరుగుడు పేరుతో నాటు మందు పంపిణీ చేస్తున్నాడు.
ఎవరీ బచ్చలి భీమయ్య...
మందమర్రి పట్టణ కేంద్రంలోని మారుతీనగర్కు చెందిన బచ్చలి భీమయ్య గతంలో సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తన తాతలు,పూర్వీకుల నుంచి వనమూలికల వైద్య జ్ఞానం నేర్చుకున్నట్లు భీమయ్య చెబుతున్నారు. కొద్దిరోజులుగా కరోనా విరుగుడు పేరుతో ఆయన నాటు మందు పంపిణీ చేస్తున్నారు. 13 రకాల వనమూలికలతో దీన్ని తయారుచేసినట్లు చెబుతున్నారు. దగ్గు,దమ్ము,ఊపిరితిత్తతుల కోసం తాను తయారుచేసిన మందు కరోనా పేషెంట్లకు కూడా బాగా పనిచేస్తోందని భీమయ్య చెబుతున్నారు.
ఇప్పటివరకూ 300 పైచిలుకు మందికి...
ఆనందయ్య తరహాలోనే భీమయ్య కూడా ఉచితంగా ఈ నాటు మందును ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్య మందు లాగే భీమయ్య మందుపై కూడా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మారుతీనగర్లోని భీమయ్య నివాసం వద్ద కరోనా మందు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. ముఖానికి మాస్కు ధరించకుండానే కరోనా రోగులను పక్కన కూర్చబెట్టుకుని వారికి మందు ఇస్తున్నానని... వారిలో ధైర్యం నింపుతున్నానని భీమయ్య చెబుతున్నారు. ఇప్పటివరకూ 300 మందికి పైగా మందు ఇచ్చానని అంటున్నారు. అంతేకాదు,తన మందు తీసుకున్న పేషెంట్లకు కేవలం రెండు గంటల్లో నయం అవుతోందని... ప్రభుత్వం అనుమతిస్తే మందును పెద్ద మొత్తంలో తయారు చేస్తానని చెబుతున్నారు.
రిస్క్ వద్దంటున్న పోలీసులు
భీమయ్య మందు కోసం వచ్చేవారి సంఖ్య పెరగడంతో పోలీసులకు దీనిపై సమాచారం అందింది. దీంతో బుధవారం(మే 26) మారుతీనగర్లోని భీమయ్య ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడినుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మందు ఎలా పంపిణీ చేస్తున్నారని ఆయన్ను ప్రశ్నించారు. మందు పంపిణీని నిలిపివేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే భీమయ్య ఇలా చేస్తున్నాడని... ఇంతవరకూ ఆయన ఎవరికీ చికిత్స అందించింది లేదని మందమర్రి ఎస్సై భూమేష్ అన్నారు.
స్థానికులు మాత్రం మందు పంపిణీ నిలిపివేయవద్దని... ఆయన గత 20 ఏళ్లుగా మందమర్రి చుట్టుపక్కల ప్రాంతాలకు నాటు వైద్యం అందిస్తున్నారని చెబుతున్నారు. అయితే శాస్త్రీయత లేని మందును తీసుకుని అనవసరంగా రిస్క్ను కొని తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
రాజమండ్రి,కడప,మందమర్రి... ఇలా చాలాచోట్ల...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా విరుగుడు పేరుతో ఇస్తున్న మందు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది.దీనికి 'శాస్త్రీయత' ఉందా లేదా అన్నది నిర్దారించేందుకు ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మందు పంపిణీకి బ్రేక్ పడింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరికొందరు నాటు వైద్యులు తాము కరోనాకు మందు ఇస్తున్నామని ముందుకొస్తున్నారు. రాజమండ్రిలో వసంత్ అనే ఓ నాటు వైద్యుడు మందు పంపిణీ చేస్తుండగా... పులివెందులలో ఇద్దరు నాటు వైద్యులు పసరు మందు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణలో భీమయ్య అనే సింగరేణి కార్మికుడు కరోనాకు మందు ఇస్తున్నానని ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
Recommended Video