ప్రయాణీకులను కంగారుపెట్టిన మెట్రో రైలు: సరదా కోసం ప్రయాణమా?
హైదరాబాద్: ఇటీవలే ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు శనివారం ప్రయాణీకులను కంగారు పెట్టింది. అనౌన్స్మెంట్ విషయంలో కంగారు పడ్డారని తెలుస్తోంది. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అమీర్ పేట నుంచి నాగోల్ బయలుదేరిన మెట్రో రైలు విషయంలో ఈ గందరగోళం కనిపించింది.
మెట్రో రైలులో తొలి రోజు సెల్ఫీలు 45వేలు, అలా చేస్తే కెమెరాకు చిక్కుతారు
అమీర్ పేట నుంచి ఆ తర్వాత వచ్చే స్టేషన్ పేరు చెప్పడానికి అనౌన్సుమెంటులో తర్వాత వచ్చే రెండో స్టేషన్ పేరు చెప్పారు. దీంతో ప్రయాణీకులు కొంత కంగారుపడ్డారు. ఆ తర్వాత అది సర్దుకుంది.
మెట్రో రూల్స్ తెలియక జనాల ఇబ్బందులు
శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో కుటుంబాలకు కుటుంబాలే రైలెక్కేందుకు మెట్రో స్టేషన్లకు వెళ్తున్నాయి. దీంతో స్టేషన్లలో ఇసుక రానంత జనం కనిపిస్తోంది. మెట్రో రైలు మోజు తీరడం మాటేమో కానీ నిబంధనలు తెలియక, దిగే స్టేషన్ మిస్సయి, జరిమానాలు కడుతూ ప్రయాణికులు నానా అవస్థలు, కంగారు పడుతున్నారు.
శనివారం ఒక్క రోజే 2.5 లక్షల మంది
మెట్రో రైలు ప్రారంభమైన తొలిరోజే రెండు లక్షల మంది, రెండో రోజు 1.6 లక్షల మంది ప్రయాణించినట్టు మెట్రో అధికారులు చెప్పారు. శనివారం కూడా ప్రయాణికులతో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. నాగోల్, అమీర్పేట మెట్రో స్టేషన్లయితే జాతరను తలపించాయి. ఈ ఒక్కరోజే 2.5 లక్షల మంది మెట్రో రైల్లో ప్రయాణించారని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుంది.
ప్రయాణీకుల అసహనం
మరికొన్ని రోజుల పాటు శని, ఆదివారాలు సహా మిగతా సెలవు దినాల్లో మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి సరదా కోసం ప్రయాణం చేయాలని అనుకునే వారు కొన్ని రోజులు ఆగాలని సూచిస్తున్నారు. మరోవైపు మెట్రో స్లేషన్లలో సౌకర్యాలు మెరుగుపడలేదు. ఒక పక్క పార్కింగ్ సమస్య, మరో పక్క టికెట్ కోసం గంటల తరబడి నిలబడాల్సి రావడం ప్రయాణికులను అసహనానికి గురిచేస్తోంది.
అదుపు చేయడం ఇబ్బంది
అన్ని మెట్రో స్టేషన్లలోనూ టికెట్ కౌంటర్లు నాలుగు చొప్పున ఉన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రయాణికులకు టికెట్ల జారీ ఆలస్యమవుతోంది. మెట్రో స్టేషన్లలో భద్రత విషయంలో అన్నిచర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆయా స్టేషన్లలో ఇద్దరు చొప్పన భద్రతాసిబ్బందిని నియమించారు. వీరిని అదుపు చేయడం ఇబ్బంది అవుతోంది.