సాగర్లో ఏం చేద్దాం..? ఉపఎన్నిక వ్యూహంపై మాణికం ఠాగూర్ డైరెక్షన్స్.. రాబోయే 10 రోజులు కీలకం..
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు. సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని... దీన్ని కేవలం ఉపఎన్నికగా మాత్రమే చూడవద్దని అన్నారు. పార్టీలో కింది నుంచి పై వరకూ జానారెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. పార్టీ నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని... సాగర్లో జానారెడ్డికి మంచి మెజారిటీ తీసుకురావాలని కోరారు. సోమవారం(ఏప్రిల్ 5) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర నేతలతో మాణికం ఠాగూర్ జూమ్ యాప్ ద్వారా వర్చువల్గా సమావేశమయ్యారు.
మాణికం ఠాగూర్ ఏమన్నారు...
సాగర్లో టీఆర్ఎస్,బీజేపీలను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాణికం ఠాగూర్ సూచించారు. బూత్ స్థాయిలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సాగర్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ అని... జానారెడ్డి రూపంలో తమ పార్టీకి బలమైన అభ్యర్థి ఉన్నాడని అన్నారు. క్షేత్రస్థాయిలో జానారెడ్డికి మంచి పలుకుబడి ఉందని... ఆయన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. టీఆర్ఎస్,బీజేపీ బయట కుస్తీ... లోపల దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని... అందుకే సాగర్లో బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నిక : భట్టి
ఇదే సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ... సాగర్ ఉపఎన్నిక కోసం ప్రతీ కార్యకర్త తానే అభ్యర్థిలా భావించి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని.. రాబోయే 10 రోజులు చాలా కీలకమని చెప్పారు. ఎవరికి కేటాయించిన గ్రామాల్లో వారు జనంలోకి చొచ్చుకెళ్లి పనిచేయాలన్నారు.సాగర్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేది కావాలని... దీన్ని కేవలం సాగర్కే పరిమితం చేసి చూడవద్దని అన్నారు. టీఆర్ఎస్,బీజేపీ దోస్తీని,ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే...
ఈ నెల 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ తరుపున నోముల భగత్,కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత జానారెడ్డి,బీజేపీ తరుపున రవి నాయక్ పోటీ చేస్తున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఊపు మీదున్న టీఆర్ఎస్ పార్టీ ఉపఎన్నికలోనూ తమదే విజయమన్న ధీమాతో ఉన్నది. అటు జానారెడ్డి కూడా ఈసారి తనదే విజయమన్న ధీమాతో ఉన్నారు. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన బీజేపీ సాగర్లో అంత దూకుడుగా ముందుకెళ్తున్నట్లు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సాగర్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.