రేప్, హత్య పుకార్లు: మీడియా ముందుకు యువతి

వివరాలు ఇలా ఉన్నాయి - డీబీఆర్ మిల్స్ దగ్గర గల ఓ అపార్ట్మెంట్లోని ‘ఎ' బ్లాక్ 101 ఫ్లాట్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఓ యువతి పనిచేస్తోంది. ఈ ఫ్లాట్కు పక్కనే గల మరో ఫ్లాట్లో యువతి వదిన పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఆ యువతిని 101 ఫ్లాట్లో పనికి పెట్టింది. ఆ యువతి గడచిన నెల 26న బాత్రూంలో కళ్లు తిరిగి పడిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కొంతదూరం వెళ్లాక మళ్లీ పడిపోయింది. ఆమె పడిపోయిన ప్రతి చోటా రక్తపు మరకలు కనిపించాయి.
దీన్ని గుర్తించిన యజమాని అదే ఇంట్లో పనిచేస్తున్న మరో వ్యక్తితో ఆస్పత్రికి పంపించారు. తొలుత ఆమెను కింగ్ కోఠిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యానగర్లోని ఆంధ్ర మహిళాసభ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువతి తేరుకున్న తర్వాత ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దోమలగూడలో ఉంటున్న ఇంటికి వెళ్లారు. యువతితో పాటు ఆమె కుటుంబసభ్యులను విచారించారు. అధిక రక్తస్రావం కారణంగానే తమ కుమార్తె కళ్లు తిరిగి పడిపోయిందని వారు చెప్పినట్టు సమాచారం.
ఆ యువతిపై కొందరు అత్యాచారం చేసి, హత్య చేశారని కథనాలు వచ్చాయి. ఇదంతా తీవ్రమైన గందరగోళానికి దారితీసింది. పైకి ఏమీ లేదని చెప్పిన పోలీసులు టెన్షన్ పడుతూనే విచారణ చేశారు. చుట్టుపక్కల ఫ్లాట్ల వాసుల్లోనూ ఒకటే కలవరం. దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం నిర్ణయించింది. యువతితో పాటు, ఆమె వదినను అపార్ట్మెంట్లోని అందరికీ చూపించి మీడియా ముందుకు తీసుకొచ్చారు.
అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం అధ్య క్షుడు కెప్టెన్ సుదర్శన్రెడ్డి, ఉపాధ్యక్షుడు కమాండర్ వీఆర్ రాజు, కోశాధికారి కెప్టెన్ శర్మ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆ యువతిని మీడియాకు చూపించారు. వాస్తవాలు తెలియకుండా ఓ పత్రిక యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారని కథనాలు రాసిందని ఆరోపించారు. ఆ యువతి ఆస్ప త్రికి సంబంధించిన సర్టిఫికెట్లను చూపిస్తామని స్పష్టం చేశారు. ఆ యువతి రక్తస్రావం జరగడానికి ఆరోగ్య కారణాలు కారణమని తెలిపారు.
అపార్ట్మెంట్లోని ఏ యువతిపైనా అత్యాచారం జరగలేదని, దీనిపై ఎటువంటి ఫిర్యాదు మాకు అంద లేదని గాంధీ నగర్ పోలీసులు చెప్పారు. విషయం బయటకు వచ్చిన తర్వాత తాము విచారించామని, ఏ చిన్న సంఘటన జరిగినా మాకు ఫిర్యాదు వస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications