Etelaపై Jagan ఆగ్రహం -KCR బర్రెలు తినేవాడైతే నువ్వు గొర్రెలు తినే రకమంటూ -BJP, Modiపైనా ఫైర్
ఎర్రజెండా పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఈటల రాజేందర్.. వామపక్ష భావజాలంతోనే రాజకీయాల్లో ఎదగడం.. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ లో చేరడం.. ఒక దశలో పార్టీలో కేసీఆర్ తర్వాత నంబర్ 2 తానే కావడం.. అంతర్గత విభేదాలు, భూకబ్జా ఆరోపణలతో చివరికి ఈటల మంత్రి పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయిన పరిణామాలపై మావోయిస్టు పార్టీ తన స్పందన తెలియజేసింది. ఇప్పటికీ తనను తాను వామపక్ష భావజాలం కలిగిన నేతగా చెప్పుకుంటోన్న ఈటలపై మావోయిస్టు పార్టీ నేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటలపై జగన్ ఘాటు లేఖ
మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్పై తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సదరు లేఖలో.. రాజీనామా సందర్భంగా ఈటల చేసిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానంటోన్న ఈటల.. ఆ పనిని ఆర్ఎస్ఎస్ లో ఉంటూ చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని, ఈటలకు, కేసీఆర్ కు మధ్య జరుగుతోన్న పోరాటంతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని మావోయిస్టు నేత జగన్ అన్నారు.

కేసీఆర్ బర్రెలు, ఈటల గొర్రెలు
కేసీఆర్, ఈటల ఒకే గూటి పక్షులని జగన్ పేర్కొన్నారు. జనమంతా ఉద్యం చేసి తెలంగాణను సాధిస్తేనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కేసీఆర్, ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని, వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదని జగన్ అన్నారు. మొన్నటి వరకూ కేసీఆర్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తులు పెంచుకున్నారని మావోయిస్టు నేత విమర్శించారు. కేసీఆర్ బర్రెలను తినేవాడైతే ఈటల గొర్రెలను తినే ఆచరణ కొనసాగించాడని ఆరోపించారు. బీజేపీలో చేరకుండా, కేసీఆర్ నియంతృత్వంపై కలిసి పోరాడుదామంటూ ప్రజాస్వామికవాదులు చేసిన వినతిని ఈటల తృణీకరించారని మావోయిస్టు నేత గుర్తుచేశారు. ఇంకా,
Recommended Video

మోదీ దేశాన్నే అమ్మేస్తున్నాడుగా
''తెలంగాణలో ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తానన్న ఈటల చివరికి తన ఆస్తులను రక్షించుకోడానికి బీజేపీలో చేరారు. మోదీ నాయకత్వంలో బీజేపీ-హిందూత్వ ఫాసిజం.. ఏకంగా దేశాన్నే అమ్మకానికి పెట్టింది. బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశప్రజలు, ఇటు కేసీఆర్ నియంతృత్వంపై తెలంగాణ జనం పోరాడుతున్న కీలక సమయంలో ఈటల బీజేపీలో చేరడం, హుజూరాబాద్ స్థానం నుంచి మళ్లీ పోటీని ఆత్మగౌరవ పోరాటంగా అభివర్ణించడం ముమ్మాటికీ మోసపూరితం. నిజానికి మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించడం ద్వారా ఈటల ఏనాడో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కేశారు. దళారీ నిరంకుశ పాలక పద్ధతుల్లో దూకుడు స్వభావం కలిగిన పార్టీ బీజేపీ. ప్రతిఘాతక పార్టీలో చేరడం ద్వారా ఆత్మగౌరవం సాధిస్తానని ఈటల చెప్పడం మోసం. ఈటల అవకాశవాదాన్ని, కేసీఆర్ నిరంకుశత్వాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి'' అని మావోయిస్టు నేత జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications