ఎన్నారై మహిళలకు టోకరా: వ్యభిచార గృహాలకు బ్రోకర్, నిర్మాతకు బెదిరింపు
హైదరాబాద్: పెళ్లి పేరుతో ఎన్నారై మహిళలకు వల వేసి, వారిని మోసం చేస్తున్న కేటుగాడిని హైదరాబాదు సిసిఎస్ పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. వెంకటరత్నా రెడ్డి అనే ఆ కేటుగాడు వ్యభిచార గృహాలకు బ్రోకర్గా కూడా వ్యవహరించినట్లు చెబుతున్నారు. సినీ నిర్మాతలను బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ అందుకు సంబంధించిన వివరాలను అందించారు. గుంటూరు ప్రాంతానికి చెందిన వెంకటరత్నారెడ్డి భారత్ మ్యాట్రిమోనీ డాట్కామ్లో వివాహం కోసం తన ప్రొఫైల్ను పెట్టాడు. అందులో తాను ఒంటరిగా జీవిస్తున్నానని, తనకు తల్లిదండ్రులు లేరని, వివాహం కాలేదని వివరించాడు.
ఈ ప్రొఫైల్ను చూసి అమెరికాలో ఉన్న ఓ యువతి వెంకటరత్నారెడ్డిని సంప్రదించింది. ఆమెను మాటలతో బురిడి కొట్టించి అమెరికాలోనే వివాహం చేసుకున్నాడు. 20 రోజులు గడిచిన తర్వాత 30వేల అమెరికా డాలర్లు(మన దేశ కరెన్సీలో రూ.20 లక్షలు) తీసుకుని ఉడాయించాడు. దాంతోో ఆ యువతి అతని గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఇండియాకు వచ్చేసినట్లు గుర్తించింది.
యువతి తన బంధువైన రాజశేఖర్రెడ్డి ద్వారా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన సీసీఎస్ పోలీసులు అతని ఆచూకీని గుంటూరులో గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వెంకటరత్నారెడ్డి కెనడాలో మరో అమ్మాయిని ట్రాప్ చేసి వివాహం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని, వీసా కావాలని ఓ ట్రావెల్ ఎజెన్సీని సంప్రదించాడని తెలిపారు.
డిగ్రీ పూర్తి చేసిన వెంకటరత్నారెడ్డికి సరైన ఉద్యోగం లభించలేదు. స్నేహితులతో కలిసి బిల్డింగ్ ఎలివేషన్ రూపొందించే వ్యాపారాన్ని నిర్వహించాడు. అందులో నష్టాలు రావడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో విదేశీ మహిళలను పెండ్లి పేరుతో మోసం చేయాలని నిర్ణయించుకుని తప్పుడు వివరాలతో మ్యాట్రిమోనియల్ సైట్లలో తన ప్రొఫైల్ను నమోదు చేసుకున్నాడని చెప్పారు.
విచారణలో వెంకటరత్నారెడ్డి డబ్బు కోసం వ్యభిచారవ్యాపారం నిర్వహించే వారికి బ్రోకర్గా కూడా పని చేశాడని తెలిపారు. సినీ నిర్మాతలతోపాటు ఐఆర్ఎస్ అధికారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన సంఘటనల్లో ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైయ్యాయి. బ్యాంక్ దోపిడీకి పాల్పడే సమయంలో మేనేజర్కు తుపాకీని గురిపెట్టిన కేసులో కూడా అతను నిందితుడు.
వెంకటరత్నారెడ్డిపై హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో మొత్తం 7 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇన్ని కేసులు ఉన్న వెంకటరత్నారెడ్డికి పాస్పోర్టు ఎలా వచ్చిందనే అంశంపై సీసీఎస్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు లేఖ రాస్తున్నట్లు ఏసీపీ రఘువీర్ తెలిపారు.