సీతక్క షాకింగ్ పోస్ట్ : ఎర్రగడ్డ శ్మశానంలో ఒకేసారి 50 మృతదేహాలకు దహన సంస్కారాలు...
హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ శ్మశాన వాటికలో ఒకేసారి 50 మంది కరోనా పేషెంట్ల మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు నిర్వహించిన వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసింది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకేరోజు ఒక్క హైదరాబాద్లోనే ఇంత మంది చనిపోతే... ప్రభుత్వం మాత్రం ఇంకా లెక్కలు దాచిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం వీరంతా ఒక్కరోజులో చనిపోయినవాళ్లు కాదని... గత 3 రోజుల్లో చనిపోయినవారందరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించామని అంటున్నారు.
జైలులో ఉన్నా కరోనా వదల్లేదుగా: 44 శాతం మంది ఖైదీలకు పాజిటివ్: ఎలా సోకిందో అర్థం కాక
అధికారులు ఏమంటున్నారు...
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి మాట్లాడుతూ... ట్రాన్స్పోర్ట్ సమస్యల కారణంగా ఒకేసారి 50 పైచిలుకు కరోనా బాధితుల మృతదేహాలను దహనం చేయాల్సి వచ్చిందన్నారు. వీళ్లంతా కరోనా వైరస్తో మృతి చెందినవారేనని...అయితే అందరూ ఒకేరోజులో చనిపోయినవాళ్లు కాదని అన్నారు. గత 2,3 రోజుల్లో కరోనాతో చనిపోయినవాళ్లందరికీ ఒకేసారి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కోవిడ్ 19 పేషెంట్ల మృతదేహాలను తరలించేందుకు జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.
షాకింగ్ అంటూ సీతక్క పోస్టు...
మరోవైపు ఈ సామూహిక దహన సంస్కారాలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో 'షాకింగ్' అంటూ షేర్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'జూలై 21న రాష్ట్రంలో 7 మంది కరోనాతో చనిపోయినట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ ఈఎస్ఐ శ్మశాన వాటికలో అదేరోజు 30కి పైగా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా నియంత్రణలో వైఫల్యం చెందిన ప్రభుత్వం మొదటి నుంచి అసలు లెక్కలను దాచిపెడుతూనే ఉంది.' అంటూ విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Recommended Video
తెలంగాణలో కమ్యూనిటీ వ్యాప్తి...
తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.రాబోయే నాలుగైదు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. గురువారం తెలంగాణలో కొత్తగా 1567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 447కి పెరిగింది.