కనికరం లేని కరోనా.!వాట్సప్ ఆన్ చేస్తే విషాద వార్తలే.!కబళించేస్తున్న కోవిడ్ మరణాలు.!
హైదరాబాద్ : దేశంలో అత్యంత విపత్కర, విషాద పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి విసురుతున్న పంజాకు అనేక మంది అశువులుబాస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా రెండవ దశ ప్రభావంతో అనేక మంది ప్రజలు అకాల మరణాలకు గురవుతున్నారు. ఏ రోజు ఏ దుర్వార్త వినాల్సొస్తుందననే ఆందోళనలో ప్రజలు ఉన్నట్టు స్పషమవుతోంది. నిత్యం చేతులో ఉండే సెల్ ఫోన్ లోని వాట్సప్ మెస్సేజ్ వస్తే ఆందోళనగా ఫోన్ వైపు చూసే పరిస్ధితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ మరణ వార్త వినాలో, బంధువులు, మిత్రులు ఎవరికి కరోనా సోకి ఆసుపత్రిపాలవుతారో తెలియని పరిస్థితులు దాపురించాయి.
Recommended Video
తగ్గుతున్న పాజిటీవ్ కేసులు.. పెరుగుతున్న మరణాల సంఖ్య..
కరోనా సోకిన తర్వాత సరైన వైద్య చికిత్స అందకపోవడంతో కూలా మంది మరణిస్తున్నట్టు తెలుస్తోంది. అయిన వాళ్లను, తోబుట్టువులను, మిత్రులను కోల్పోయిన వారు శోకసంద్రంలో మునిగిపోతున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న ఆంక్షల వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్టు తెలుస్తోంది. కరోనా రెండవ దశ ప్రభావంతో తల్ల దండ్రుల ఇద్దరికి కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్సతీసుకుంటున్న తరుణంలో పిల్లలు ఒంటరిజీవితాన్ని అనుభవిస్తున్న పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
అంతులేని విషాదం.. అయినవాళ్లను నిర్ధాక్షిణ్యంగా దూరం చేస్తున్న కరోనా..
కరోన చికిత్సకోసం లక్షల రూపాయల బిల్లులను చెల్లించలేక, చూస్తూ చూస్తూ ఐన వారిని వదులుకోలేక అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్న దయనీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇక బెడ్ మీద ఉన్న కరోనా బాదితుడు బిల్లు ఎంతవుతుందో, తమ కుటుంబ సభ్యులు డబ్బులకోసం ఎక్కడ ఇబ్బందులు పడతారోననే ఆవేదనతో తుద శ్వాస విడుస్తున్న సందర్బాలు కూడా లేకపోలేదు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసి ఎంతో కొంత కూడబెట్టుకున్న డబ్బును కరోనా మహమ్మారి కాజేస్తుంటే సామాన్యులకు కన్నీళ్లు తప్ప మరోటి మిగలడం లేదు. చేతిలో సరైన సమయానికి డబ్బులు ఉండక, సకాలంలో అప్పు పుట్టక అనేక మంది వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదిలేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
దడపుట్టిస్తున్న వాట్సప్ మెస్సేజ్ లు.. మరణ వార్తలతో బెంబేలెత్తుతున్న జనాలు..
సంపన్న వర్గాలను మినహాయిస్తే సామాన్య మధ్య తరగతి ప్రజలు కరోనా ఉదృతికి పిట్టల్లా రాలిపోతున్న విషాద ఘటనలు నెలకొంటున్నాయి. బంధు మిత్రుల తేడా లేకుండా అందరిని అనంత లోకాలకు పంపించి ప్రతిఒక్కరిని శోకసంద్రంలోకి నెడుతోంది కరోనా. దూరపు బంధువుల దగ్గర నుండి సెల్ ఫోన్ మోగినా, వాట్సప్ మెస్సేజ్ వచ్చినా ఉలిక్కిపడి చూడాల్సిన భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క కోవిడ్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కఠిన విధానాల వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతున్నా మరణాల రేటు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది.
రెండో దశతోనే అల్లకల్లోలం.. మూడో దశ పరిస్థతి తలుచుకుంటేనే భయానకం..
ప్రస్తుతం 33,53,765 మంది కొవిడ్తో బాధపడుతుండగా, క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. సోమవారం 4,22,436 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది. మరోవైపు, సోమవారం 15,10,418 మందికి టీకా అందింది. మొత్తంగా 18.44 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రెండో దశ 40 ఏళ్లు దాటిన వారిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుండగా మూడో దశ చిన్న పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మూడోదశ మహమ్మారి విజృంభించి ఎంత మంది తల్లదండ్రులకు కడుపుకోత మిగుల్చుతుందోననే ఆవేదన వ్యక్తం అవుతోంది.