కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం.. కేసీఆర్కు టాప్ పోస్ట్, కేటీఆర్కు పీసీసీ: బండి సంజయ్
న్యూఢిల్లీ: కవితకు బెయిల్ వస్తుందని.. ఆ తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను పీసీసీ చీఫ్ చేస్తారని జోస్యం చెప్పారు. అలాగే, కవిత బెయిల్ పై కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని అన్నారు బండి సంజయ్. ఆ తర్వాత కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని వ్యాఖ్యానించారు. పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలదని అన్నారు. కవిత బెయిల్ కు.. బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయమన్నారు.

ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందన్నారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే కవితకు బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమేనని బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని ప్రశ్నించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురద జల్లుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ సర్కారును బండి సంజయ్ ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానంటున్నట్లుంది కాంగ్రెస్,బీఆర్ఎస్ తీరు అంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications