పాల బావి రహస్యం: కరోనా మహమ్మారి కూడా తోకముడిచింది, దూద్ బౌలి విశేషాలు
కరీంనగర్: బావుల్లో ఎక్కడైనా నీళ్లు నీలం రంగులోనే ఉంటాయి. కానీ, ఇక్కడి బావిలో మాత్రం నీళ్లు.. పాలలా తెల్లగా ఉంటాయి. నీళ్లు పాలలా ఉండటంతో ఈ బావిని పాల బావి అని పిలవడం జరుగుతోంది. అంతేగాక, ఈ పాలలాంటి నీళ్లు తాగితే రోగ బాధలు కూడా ఉండవట. ఇంతకీ ఈ బావి ఎక్కడుందో తెలుసా.? కరీంనగర్ జిల్లాలో.

సర్వరోగ నివారిణి ఈ దూద్ బౌలి
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలోని శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఈ పురాతన పాల బావి ఉంది. నీళ్లు పాలలా ఉండటంతో నిజాం కాలం నుంచీ దీన్ని దూద్ బౌలీగా పిలుస్తున్నారు. ఈ బావిలోని నీరు సర్వరోగ నివారిణి అని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక, వేసవి కాలంలోనూ ఈ బావిలో నీరు ఇంకిపోదట.

పాల బావి నీరు తాగినవారికి కరోనా కూడా సోకలేదు
చుట్టూ పెద్ద గుట్టలు, రాతి గోడల మధ్య ఉన్న ఈ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి. ఈ బావిలో నీళ్లు తాగితే ఎలాంటి రోగాలు రావని, వచ్చినవారు తాగితే నయమైపోతాయని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక, కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ బావిలో నీరు తాగడం వల్ల స్థానికంగా ఉండే గ్రామాల ప్రజలకు కరోనా కూడా సోకలేదట. అందుకే ఈ బావిలో నీరు తాగేందుకు చుట్టూ గ్రామాల ప్రజలు కూడా తరలివస్తుంటారు.

దూద్ బౌలీ నుంచి నీళ్లు తెప్పించుకుని తాగిన నిజాం నవాబు
కాగా, మొలంగూర్ బావికి పెద్ద చరిత్రే ఉంది. ఈ బావిలో నీటిని నిజాం నవాబు కూడా తాగేవారట. రోజూ గుర్రం మీద నిజాం నవాబుకు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లేవారట. ఔషధ గుణాలు ఉండటంతో ఈ బావి నీటిని హైదరాబాద్ నగరానికి తెప్పించుకుని నిజాం నవాబు తాగేవారని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. నల్లాల ద్వారా గ్రామ ప్రజలకు నీరు అందుతున్నప్పటికీ.. చాలా మంది గ్రామస్తులు ఈ బావి నీటిని తాగడం మాత్రం ఆపలేదు. మరోవైపు, ఈ నీటి ప్రత్యేకతను తెలుసుకునేందుకు జలవనరుల సంస్థ కూడా పరిశోధనలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు, ఇక్కడి మొలంగూర్ కోట కూడా పర్యాటకులను ఆకట్టుకునేవిధంగా ఉంటుంది. దీంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications