బండి సంజయ్ నీ ఆరోపణలు నిరూపించు.. రాజకీయాల నుండి తప్పుకుంటా: మంత్రి అల్లోల
నిర్మల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రివర్స్ ఎటాక్ కు దిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బిజెపి నేతలను హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో భాగంగా శివాజీ చౌక్ లో జరిగిన రోడ్ షోలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని అసత్యాలు చెప్పారని మండిపడిన ఇంద్రకరణ్ రెడ్డి, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.
నిర్మల్ లోని మున్సిపాలిటీ లో నాల్గవ తరగతి ఉద్యోగుల నియామకం లో అవినీతి నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే బండి సంజయ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ఆయన సవాల్ విసిరారు. తాను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలే కానీ బిజెపి నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దుర్భాషలాడుతున్నారని పేర్కొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.
సీఎం కేసీఆర్ గురించి, ఎమ్మెల్సీ కవిత గురించి అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాదయాత్రలో అసభ్యమైన పదాలు వాడడం మంచి పద్ధతి కాదని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో విమర్శించవచ్చు, ప్రభుత్వ పథకాలు వ్యక్తులకు అందకుంటే వాటి పై విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగత దూషణలు చేయడం మాట్లాడే వ్యక్తుల యొక్క దిగజారుడుతనం చూపిస్తాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. తమకు తెలంగాణ అభివృద్ధి తప్ప మరేది ఆసక్తి లేదని పేర్కొన్న ఆయన బిజెపి నేతలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారన్నారు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు పాల్పడుతూ, తాము చెప్పినట్టు వినని వారి ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకొని కేంద్రం పనిచేస్తోందని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు.