జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు; అదంతా తప్పుడు ప్రచారం: మంత్రి ఎర్రబెల్లి
పంచాయతీ నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వారిని ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవటం అవాస్తవమన్నారు.
ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వం తరఫున తాను గాని మరెవరు గాని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల చర్చలకు పిలవలేదని, ఇక దీని పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని, సీఎం వారికి సాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి మనసున్న మహారాజు అని పేర్కొన్నారు.

కెసిఆర్ కు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పై మంచి అభిప్రాయం ఉందని ఆ పేరును చెడగొట్టుకోవద్దని హితవు పలికారు. ప్రభుత్వాన్ని ఆదేశించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలోచేరినప్పుడే ఒప్పందం ప్రకారం బాండ్ రాసిచ్చారని, సంఘాలు కట్టబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి యూనియన్ లలో చేరబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగమని, బాండు రాసిచ్చారని పేర్కొన్నారు.
మీరు రాసిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదని ఆయన పేర్కొన్నారు. ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తనతో మాట్లాడారని, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే సమ్మె విరమించాలని విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications