తెలంగాణా, ఏపీ అసెంబ్లీ సీట్లు పెంచేది లేదన్న కేంద్రానిది అణగదొక్కే కుట్ర,అసలు రీజన్ చెప్పిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఎందుకు పెంచరని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఇప్పట్లో ఉండదని 2026 జనగణన వివరాలు ప్రచురితమైన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయని కేంద్రం వెల్లడించింది. మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కూడా అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుందని పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది. ఇక దీని పై మండిపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం మొండి వైఖరి మరోమారు చాటుకుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా కేంద్రం అణగదొక్కే కుట్ర
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా కేంద్రం అణగదొక్కే కుట్ర అని విమర్శించారు. రెండు రాష్ట్రాల ఆకాంక్షలకు కేంద్రం అడ్డుపడుతున్నదని విమర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ సీట్లను పెంచేది లేదని చెప్పి కేంద్రం తన నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ కు లేని అడ్డు తెలుగు రాష్ట్రాలకు ఎందుకు ఉందని ప్రశ్నించిన ఎర్రబెల్లి దయాకర్ రావు రాజ్యాంగంలోని 170 కి లోబడి, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం ఏపీలో 175 సీట్లను 225కు, తెలంగాణలో 119 సీట్లను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

2026 తర్వాత సీట్లు పెంచుతామని చెప్పటం ఏకపక్షం
2026 జనగణన తర్వాత అసెంబ్లీ సీట్లను పెంచుతామని చెప్పటం ఏకపక్ష నిర్ణయమని పేర్కొన్నారు. గతంలో చట్ట సవరణ చేసి తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో చేర్చలేదా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ సీట్లను పెంచలేదా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి దయాకర్ రావు రాజ్యాంగ, న్యాయనిపుణులు సీట్ల పెంపు సాధ్యమని చెబుతుంటే, కేంద్రం సాధ్యం కాదని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కే. కేశవరావుతో కలిసి మన ఎంపీలు అప్పటి కేంద్రమంత్రి, ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన విషయం గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల పట్ల బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చెయ్యాలని సవాల్
రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు ఎర్రబెల్లి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు నాయకులు ఆకాంక్షలపై పట్టింపు లేదని ధ్వజ మెత్తారు. సీట్లు పెరిగితే రాజకీయ నాయకులు, పార్టీలు బలపడతాయి అని బిజెపికి అక్కసు అని ఎర్రబెల్లి అసలు కారణం ఇదేనన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదగడం బీజేపీకి ఇష్టం లేదని నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్రం చేసిన ప్రకటన తర్వాతనైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలు మాట్లాడాలని, బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video

కేంద్ర సర్కార్ ను తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒప్పించాలన్న మంత్రి
జరుగుతున్న పురోగతిని అడ్డుకోవడం కాదని, ఉత్తర ప్రగల్బాలు పలకడం కాదని, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వాన్ని ఒప్పించాలని సవాల్ విసిరారు. అవసరాల కోసం రాజ్యాంగాన్ని సవరించినట్లే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం చేయాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications