దేవరుప్పల రాళ్ళదాడిపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్; బండి సంజయ్, బీజేపీగూండాలను విడిచిపెట్టబోమని వార్నింగ్
బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో దేవరుప్పల లో చోటుచేసుకున్న ఘర్షణ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇప్పటికే బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించి, అటు పోలీసుల వైఫల్యంపై కూడా మండిపడితే, తాజాగా టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపిపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ను టార్గెట్ చేశారు.

గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా దేవరుప్పల చౌరస్తాలో జరిగిన రాళ్ళ దాడిలో గాయ పడి జనగామ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజేపి వైఖరిపై నిప్పులు చెరిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి తదితరులు కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు.

బండి సంజయ్ 500మండి గూండాలతో పాదయాత్ర చేస్తున్నారు: మంత్రి ఎర్రబెల్లి
ఇక దేవరుప్పలలో జరిగిన ఘర్షణపై మండిపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 500 మంది గూండాలతో పాద యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ టిఆర్ఎస్ కార్యకర్తల పైనే కాదు సామాన్య జనాల పైన కూడా రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడి చేయిస్తున్నాడు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేవరుప్పలలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న రోజే బండి సంజయ్ ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం విచారకరం అంటూ వ్యాఖ్యానించారు.

ప్రజల్లో సానుభూతి కోసమే బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్
ఈ ఘటనతో బీజేపీ వైఖరి మరోసారి బయట పడిందని పేర్కొన్న ఎర్రబెల్లి ప్రజల్లో సానుభూతి పొందడానికే ఇలాంటి ఘటనలకు బీజేపీ పాల్పడుతున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు స్వాతంత్ర్య వేడుకలకు ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారని, ఇదే సయంలో బండి సంజయ్ పాదయాత్ర పేరుతో దేవరుప్పల చౌరస్తాకు 500 మంది గూండాలతో వచ్చారని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి సీఎం కెసిఆర్ కుటుంబం పై, మంత్రినైన నాపై, ఇష్టానుసారంగా మాట్లాడటమే దేవరుప్పలలో ఘర్షణకు దారి తీసిందని వెల్లడించారు.

ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు : వార్నింగ్ ఇచ్చిన మంత్రి
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకరిద్దరు అలా మాట్లాడవద్దని అనడంతో బీజేపీ గూండాలు టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలపై దాడులకు దిగారని మంత్రి పేర్కొన్నారు. ఆడవాళ్లని కూడా వదలకుండా విచక్షణారహితంగా బిజెపి నేతలు దాడి చేశారని, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఇక పోలీసులు కూడా సరైన సమయంలో స్పందించలేదని మంత్రి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications