బీసీల కోసం ‘కేసీఆర్ ఆపద్భంధు’, మహిళలకు ప్రత్యేక శిక్షణ: మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న 'కేసీఆర్ ఆపద్భంధు' పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే శాఖా పరమైన కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.
బీసీ మహిళల స్వావలంబన కోసం రూ. 100 కోట్లతో మరో నూతన పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నిఫ్ట్ లో శిక్షణ అందించడంతోపాటు 25 మంది సభ్యులు యూనిట్గా కుట్టు మిషన్లు, అన్ని రకాల కుట్టు యంత్రాలను అందిస్తామని తెలిపారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వర్గాలవారీగా ఒక్కో వర్గంలో 5వేల మంది చొప్పున పనిముట్లను అందించే పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
అంతేగాక, రూ. 300 కోట్ల వ్యయంతో సుమారు 50 వేల బీసీ యువతీ యువకులకు ఏసీ రిపేర్, టూవీలర్ రిపేర్ తదితర వృత్తి విద్యలపై శిక్షణ, పనిముట్లు అందించి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలను త్వరలో చేపడతామన్నారు. బీసీల్లోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏ గుర్తింపునకు నోచుకోని 17 కులాలను బీసీల్లో చేరుస్తామని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. 1200 కోట్లను బీసీ సంక్షేమ శాఖకు సీఎం కేసీఆర్ అదనంగా కేటాయించారని మంత్రి గంగుల తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత స్టడీ సర్కిళ్లకు అదనంగా సిరిసిల్లలో మరో కొత్త బీసీ స్టడీ సర్కిల్ ను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల వద్దే పంటను కొంటామన్న సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా 6408 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాతల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1800-425-0033, 1967 టోల్ ఫ్రీ నెంబర్లను ఫిర్యాదులు, సమాచారం కోసం అందుబాటులో ఉంచినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.