చంద్రబాబుపై కవిత, హరీష్ కీలక వ్యాఖ్యలు - అంతా అందుకోసమే..!!
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలు కవిత, హరీష్ రావు చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మంలో జరిగిన సభలో తెలంగాణలో టీడీపీ యాక్టివ్ చేస్తామని.. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. పార్టీని వీడిన నేతలు తిరిగి రావాలని ఆహ్వానించారు. త్వరలో నిజాబాద్ ఆ తరువాత మరిన్ని సభలకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇదంతా చంద్రబాబు పక్కా వ్యూహాత్మకంగా చేస్తున్న రాజకీయంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు తాజాగా ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీలు ఎన్ని వచ్చినా, కేసీఆర్ ఒక్కరే లీడర్ అని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో పునర్మించాలని పిలుపునిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ కాదని చెప్పుకొచ్చారు. గతంలోనే టీడీపీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని.. మళ్లీ అదే జరగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కవిత పేర్కొన్నారు.
మంత్రి హరీష్ రావు చంద్రబాబు సభ పైన ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తో ఎవరు కలిసినా భస్మాసుర హస్తమని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు పట్టించుకోరని చెప్పుకొచ్చారు. ఇదంతా బీజేపీతో పొత్తు కోసం ఆడుతున్న డ్రామాగా హరీష్ అభివర్ణించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
ఏపీలో చెల్లని చంద్రబాబు తెలంగాణలో చెల్లుతారా అని ప్రశ్నించారు. ఏపీలో తిరిగినా కొన్ని ఓట్లు వస్తాయని..తెలంగాణలో ఏం చేసినా ఉపయోగం లేదని హరీష్ పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త రాజకీయం ద్వారా బీజేపీకి దగ్గరయ్యే వ్యూహాలు చంద్రబాబు అమలు చేస్తున్నారనే వాదన మొదలైంది. అయితే, చంద్రబాబు ను ఏపీ నేతగా..టీడీపీ ఏపీ పార్టీగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ ..టీడీపీతో సఖ్య కోసం ముందుకు వస్తుందా అనే చర్చ మొదలైంది.