బండి సంజయ్కి హరీశ్ రావు సవాల్-దమ్ముంటే ఆ పనిచేయాలని-ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లయినా...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లయినా ఎక్కడా అభివృద్ది జరగలేదన్నారు. బండి సంజయ్కి దమ్ముంటే హుజురాబాద్ ప్రజల కోసం కేంద్రం నుంచి రూ.5వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సోమవారం(ఆగస్టు 30) మంత్రి హరీశ్ రావు పర్యటించారు.
నియోజకవర్గ పర్యటనలో భాగంగా హరీశ్ రావు వీణవంక మండలానికి వెళ్లారు. నర్సింగాపూర్కి చెందిన పలువురు హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లయిందని.. వీణవంకలో ఎక్కడైనా కనీసం రూ.10లక్షలు అభివృద్ది చేశాడా అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే... వ్యక్తిగా ఆయనకు,బీజేపీకి లాభం జరుగుతుందని అన్నారు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే హుజురాబాద్ ప్రజలందరికీ లాభం జరుగుతుందన్నారు.

కేంద్రంలో ఏడేళ్లుగా అధికారంలోకి ఉన్న బీజేపీ ప్రజల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో సామాన్య జనాలను ఇబ్బందులకు గురిచేశారే తప్ప ఒక్క రూపాయి నల్ల ధనం బయటకు తీయలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంత అభివృద్ది జరిగిందో లెక్కలతో సహా అన్నీ బయటపెట్టామని చెప్పారు.హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ది చెందుతుందన్నారు.
హుజురాబాద్లో ఆదివారం(ఆగస్టు 29) ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్ల కార్యక్రమంలోనూ హరీశ్ రావు బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నామమాత్రపు సాయం మాత్రమే అందుతోందన్నారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు.అంగన్ వాడీ వర్కర్స్కు ఇచ్చే వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10,950 కాగా కేంద్రం వాటా కేవలం రూ.2700 మాత్రమేనని పేర్కొన్నారు.
బండి సంజయ్కి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ :
ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం(ఆగస్టు 29) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విసిరారు.గడిచిన ఏడేళ్లలో కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలన్నారు.తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ దొంగ పాద యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. కేటీఆర్,హరీశ్ రావు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని... కుటుంబ పాలన అంటూ రేవంత్ రెడ్డి,బండి సంజయ్ విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే వారు నాయకులయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ను ఫాంహౌస్ సీఎం అనడాన్ని తప్పు పట్టారు. ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలు అమలయ్యాయని చెప్పారు.ముఖ్యమంత్రి కేసిఆర్తోనే హుజురాబాద్ సమగ్ర అభివృద్ది సాధ్యమన్నారు. కేసీఆర్ సుపరి పాలన దేశానికే దిక్సూచిలా మారిందన్నారు.
ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవుల కోసం పాకులాడారని విమర్శించారు. ప్రజలకు అన్నీ గుర్తున్నాయని పేర్కొన్నారు.ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు.తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులకు సైతం కేంద్రం కోత పెట్టిందన్నారు.












Click it and Unblock the Notifications