మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం: జూనియర్ బట్టలూడదీసి ఫొటోలు, మంత్రి హరీశ్ రావు సీరియస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సూర్యపేటలోని ఓ కాలేజీ ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేశారు సీనియర్ విద్యార్ధులు. శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు సీనియర్లు.. బాధిత విద్యార్థి ఒంటిపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫొటోలు తీశారు. జుట్టు కూడా కత్తిరించినట్టు తెలిసింది.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్థి.. హైదరాబాద్లోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపాడు.. దీంతో, వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ విద్యార్థిని రక్షించారు. ఈ ఘటనలో 25 మంది సీనియర్లపై కేసు కూడా నమోదు చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై సీరియస్గా స్పందించారు మంత్రి హరీష్రావు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం తనకు తెలిసిందన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, ఈ ఘటనపై విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ను ఆదేశించినట్టు వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం వరకు రిపోర్ట్ ఇవ్వాలని కోరామని, ర్యాగింగ్ చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి హరీష్రావు. సోమవారం బంజారాహిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్ రావు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై జర్నలిస్టులు అడిగినప్రశ్నకు మంత్రి హరీశ్ రావు ఈ మేరకు స్పందించారు.












Click it and Unblock the Notifications