రాహుల్ గాంధీది ఐరన్ లెగ్.. ఆయన అడుగుపెట్టినచోట కాంగ్రెస్ ఓటమి: మంత్రి హరీష్ రావు
తెలంగాణ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ ని టార్గెట్ చేసిన మంత్రి హరీష్ రావు ఆయన పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ అని పేర్కొన్న మంత్రి హరీష్ రావు, రాహుల్ గాంధీ ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమైందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో జకోరా ఎత్తిపోతల పథకానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ని టార్గెట్ చేశారు. 94 శాతం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వల్లే ఓటమిపాలైంది అన్న మంత్రి హరీష్ రావు, అటువంటి రాహుల్ గాంధీ తెలంగాణను ఉద్ధరిస్తాడా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ హయాంలో పెరిగిన పంట దిగుబడి కాంగ్రెస్, బిజెపిలకు కళ్ల మంట గా మారిందని విమర్శలు గుప్పించారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఎరువుల సమస్య, విత్తనాల సమస్య ఎక్కువగా ఉండేవని, ప్రజలు ఎరువులు విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలుచున్న ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజ్ లు లేకపోవడంతో కాంగ్రెస్ హయాంలో రైతులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం అన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఇక ఇదే సమయంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బిజెపి, రాష్ట్రంలో రైతుల ఖర్చులను రెట్టింపు చేసిందంటూ బీజేపీని మంత్రి హరీష్ రావు టార్గెట్ చేశారు. బిజెపి రైతులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించిన హరీష్ రావు కాంగ్రెస్, బిజెపి రెండూ తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పనిచేసే పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ నే అని స్పష్టం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి, ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయని, కానీ టిఆర్ఎస్ పార్టీ అలా కాదని తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.