చంద్రబాబు అడ్డు, సుజనతో గవర్నర్ వద్ద లాబీయింగ్: ఇంద్రకరణ్
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు దర్యాఫ్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలకు ఢోకా లేదన్నారు.
కేంద్రం సెక్షన్ 8 అమలు చేస్తుందనుకోవడం లేదన్నారు. గవర్నర్ వద్ద కేంద్రమంత్రి సుజనా చౌదరితో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లాబీయింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.
గురువారం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు అడిగినంత నిధులు ఇవ్వకపోవడం తప్ప కేంద్రం తమకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. స్మార్ట్ సిటీలు, గృహ నిర్మాణం, అమృతు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు.
అవసరమైన చమురును అందిస్తాం: ధర్మేంద్ర
తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనంత చమురును అందిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. తెలంగాణలో రూ. 1,300 కోట్లతో పెట్రోల్ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు.
ఈస్ట్ టూ సౌత్ కొత్త పైప్లైన్ వేస్తామని చెప్పారు. ఒడిశాలోని పారాదీప్ నుంచి హైదరాబాద్ వరకు కొత్త పైప్లైన్ వేస్తామని తెలిపారు. ప్రతి మహిళ గ్యాస్తోనే వంట చేసుకునేలా ఎల్పీజీ కనెక్షన్లు పెంచుతున్నామని ఈ సందర్భంగా అన్నారు.