'శ్రీశైలం' కుట్ర: చంద్రబాబుపై మళ్లీ కెటిఆర్, కొత్తవారితో ఇబ్బందే కానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి విమర్శలు గుప్పించారు. శ్రీశైలంలో విద్యుత్ వాటా ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆయన శుక్రవారం మండిపడ్డారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం వల్లనే హైదరాబాదులో నీటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. హైదరాబాద్ కోసం 30 టీఎంసీలు గల రెండు జలాశాయాలను నిర్మిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేశామన్నారు. దేశం అబ్బురపడేలా విద్యుత్ సరఫరా కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ చిత్త శుద్దివల్లే ఇదంతా సాధ్యమవుతోందన్నారు. ఆయన తీసుకున్న యాక్షన్ ప్లాన్ విద్యుత్ సమస్య పరిష్కారానికి ఉపయోగపడిందన్నారు.
తెలంగాణ మొత్తానికి ఆరు వేల నుంచి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని, విద్యుత్ వ్యవస్థను పీఎల్ఎఫ్ను 60 నుంచి 90 శాతానికి తీసుకొచ్చామన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యుత్ కోసం ఆందోళనలు చేసిన సంఘటనలు కోకొల్లలన్నారు.
గతంలోఎండా కాలం వస్తే ఎడాపెడా కరెంట్ కోతలు ఉండేవని, ఒక్కో అపార్ట్మెంట్లో నివాసం ఉండే వాళ్లు విద్యుత్ కోసం జనరేటర్లు నడపడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేవారని, కానీ ఇవాళ జనరేటర్లు, ఇన్వర్టర్ అమ్మకాల బిజినెస్ దెబ్బతిన్నదన్నారు.
ప్రజలకు లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. సీఎం ప్రణాళిక చాలా పెద్దగా ఉందని, ఆయన ఇంతటితో సంతృప్తి చెందడం లేదన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ముందుకు పోతున్నట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్లోనే తయారైందని కేటీఆర్ తెలిపారు. ఇందుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 60వేల డబుల్ బెడ్ రూంఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాలు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కొత్త వారి చేరికతో ఇబ్బందే
పార్టీలో కొత్త వారి చేరికతో కొంత ఇబ్బందులు తప్పవని మంత్రి కెటిఆర్ అన్నారు. వాటిని తాము అధిగమిస్తామని చెప్పారు. అయితే, చేరికల వల్ల తమ పార్టీ బలం పెరుగుతుందన్నారు. తాము ఎవరినీ ప్రలోభాలకు గురి చేయడం లేదన్నారు. కెసిఆర్ పాలన నచ్చి వారు పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.
తమ పార్టీ సత్తా ఏమిటో జనవరి తర్వాత తెలుస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ మార్టీ కాదని, ఇతర రాజకీయ పార్టీల్లాగే టిఆర్ఎస్ ఒకటి అన్నారు.
తెలంగాణలో ఈనెల 7, 8న కేంద్ర బృందం పర్యటన
తెలంగాణలో ఈ నెల 7, 8 తేదీల్లో క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఆదివారం రాష్ట్రానికి రానున్న కేంద్ర ప్రతినిధులు కరవు జిల్లాల్లో 3 బృందాలుగా పర్యటించనున్నారు.
నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఒక బృందం, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒక బృందం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో మరో బృందం పర్యటించనుంది. ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రప్రధాన కార్యదర్శి, 8న సీఎంతో భేటీ అనంతరం కేంద్ర బృందం ఢిల్లీ వెళ్లనుంది.