సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండగ-పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం-సంస్థాగత నిర్మాణానికి యాక్షన్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2న 'జెండా పండగ'ను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. గ్రామాలు,మున్సిపాలిటీలు,మున్సిపల్ కార్పోరేషన్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. అదే రోజు నుంచి అన్ని జిల్లాల్లో కమిటీల ఏర్పాటుపై ఫోకస్ చేయనున్నారు. దీనికి సంబంధించి మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,జిల్లాల నేతలు పాల్గొన్నారు. జెండా పండగ నిర్వహణ,కమిటీల ఏర్పాటుపై నేతలకు కీలక సలహా,సూచనలు చేశారు.

కేటీఆర్ ఏమన్నారు...
టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ జెండా పండగలో పాల్గొనేలా చూడాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే రోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారని చెప్పారు.పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జెండా పండగ రోజు నుంచే కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందన్నారు. సెప్టెంబర్ నెల చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలోని 12769 గ్రామాలు,142 మున్సిపాలిటీలు,మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డు స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు. అన్ని కమిటీల్లో 51శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

కమిటీల ఎంపికపై కీలక సూచనలు...
సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని స్థానిక నేతలంతా సమన్వయంతో నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. అందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ 2 వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందన్నారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. జిల్లా అద్యక్షులు, నూతన జిల్లా కార్యవర్గాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకుని ప్రకటిస్తారన్నారు.

హైదరాబాద్లో కమిటీల కోసం ప్రత్యేక సమావేశం...
పార్టీ కమిటీల కూర్పు విషయంలో కేటీఆర్ పలు సూచనులు చేశారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో చోటు ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని, లేనిపక్షంలో అవి చెల్లుబాటు కావన్నారు. పార్టీ అనుబంధ కమీటీలతో పాటు గ్రామ, మండల స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుకు సూచనలు చేశారు. ముందుగా మండల కమిటీలు పూర్తి చేసిన తర్వతా గ్రామ స్ధాయి సోషలు మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమీటీల్లో మహిళా కార్యకర్తలకు స్థానం కల్పించాలని సూచించారు.
హైదరాబాద్ నగర విస్తృతి, జనాభా,ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా నగరంలో కమిటీల ఏర్పాటుకు ప్రత్యేక సమావేశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో బస్తీ కమిటీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల ఏర్పాటులో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం సమన్వయం చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications