ఆ ఘనత కేసీఆర్దే: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కరీంనగర్: ఆదివాసీల చిరకాల కోరికను నెరవేర్చింది కేసీఆర్ సర్కారేనని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రూ. 73వేల కోట్లను రైతుల ఖాతాల్లో సీఎం కేసీఆర్ వేశారని.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. మొదట జిల్లాల్లోని తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కాలేజీకి బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలగా పేరు మార్పు చేశారు.
పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలకు భూముల పట్టాలు అందించి, వారి చిరకాల కోరికను నెరవేర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో ఒక లక్షా 51 వేల మందికి ఏకకాలంలో 44.6 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందించామని మంత్రి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించలేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం 1614 మంది గిరిజనులకు 2858 ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందించామని తెలిపారు. భవిష్యత్తులో భూ హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలకు భూ యాజమాన్య హక్కులను కల్పించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,614 మంది లబ్ధిదారులకు 2,858 ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు… pic.twitter.com/KMcFpFRh6r
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 6, 2023
కుమురం భీం, జల్ జంగిల్ జమీన్ నినాదా స్ఫూర్తితో 3 వేల తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి.. 30 వేల వార్డులను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో గిరిజనుల గడప గడపకు సంక్షేమం ఫలాలు అందేలా చూస్తున్నారు.
గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించామని గుర్తు చేశారు. ఎస్టీ గురుకులాల్లో వేలాది మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణలో ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications