నన్ను జనాలు నిలదీస్తారనే ఆందోళన: కేటీఆర్, అందర్నీ ఆకట్టుకున్నారు
హైదరాబాద్: భాగ్యనగరంలో మురుగు, వరద నీటి వ్యస్థలను సుమారు రూ.13,425 కోట్లతో ఆధునికీకరిస్తామని మంత్రి కేటీ రామారావు శనివారం పేర్కొన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో ఆర్క్ దక్షిణ్ సదస్సులో ప్రసంగించారు. ఆయన ఆర్కిటెక్ట్ ఆడియన్స్, అర్బన్ ప్లానర్స్ను ఆకట్టుకున్నారు.
హైదరాబాద్ వారసత్వ సంపదకు నిలయమని, ఆ సంపద, ఆధునికతల మధ్య సమతూకం పాటిస్తూ పారిశ్రామిక, ఐటి, విమానయాన తదితర రంగాలను ప్రోత్సహించాలన్నారు. తాను చూస్తున్న ఐదు శాఖల్లో మున్సిపల్ విభాగమే సవాలుతో కూడుకున్నదన్నారు.
నగరీకరణ నిరంతర ప్రక్రియ అన్నారు. నగరీకరణలో ఆర్కిటెక్టుల పాత్ర కీలకమన్నారు. భారీ వర్షాలు పడినప్పుడు చెన్నై, ముంబైలో తలెత్తిన పరిస్థితులు హైదరాబాదులోను రావని చెప్పలేమన్నారు. గతంలో ఐదు ప్రణాళికలు ఉండటంతో నగర అభివృద్ధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీంతో తాము సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు.
తాను నగర పర్యటనలకు వెళ్తే రోడ్డు సమస్యలపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఆందోళనగా ఉంటోందన్నారు. నగరంలో 9వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా, 350 కి.మీ. నడక మార్గాలే ఉన్నాయని, దీంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కేటీఆర్ చీఫ్ ఆర్కిటెక్ట్గా..
హైదరాబాదును విశ్వనగరాల సరసన నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే, విశిష్టమైన చరిత్ర గల నగర సంస్కృతి, సంపద పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి కేటీ రామారావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్దిపై చీఫ్ ఆర్కిటెక్ట్గా ప్రత్యేక శ్రద్ధ చూపడమే కాకుండా భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నారన్నారు.
అదే క్లిష్టం
తాను ఐదు శాఖలను నిర్వహిస్తున్నప్పటికీ పురపాలక శాఖే అన్నిటికంటే క్లిష్టమైనదని, భారతదేశంలోని నగర స్థానిక సంస్థల వ్యవస్థలో వాటి పనితీరులో ఎక్కడెక్కడ లోపాలున్నాయో స్పష్టంగా అర్థమైందన్నారు.
కేసీఆర్ శ్రద్ధ
నగరాలను అంతర్జాతీయంగా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని ప్రభుత్వాలు ప్రాథమిక విషయాలపై పెద్దగా దృష్టి సారించవని, మన సీఎం కేసీఆర్ మాత్రం రహదారులు, డ్రైనేజీలు, వరదనీటి కాల్వలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.13 వేల కోట్ల్లను ఖర్చు చేస్తున్నారన్నారు.
చరిత్ర గల భాగ్యనగరం
నాలుగు వందల ఇరవై ఏళ్లకు పైగా చరిత్ర గల భాగ్యనగరం.. విశిష్టమైన వారసత్వ సంపద, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని కేటీఆర్ కొనియాడారు. కొత్తగా ఐటీ పరిశ్రమలు, పౌరవిమానయాన రంగాల వంటివి నగరంలో విశేషంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
పక్కా ప్రణాళికలు
అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నగరాలతో పోటీ పడేటప్పుడు ఎదురయ్యే క్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో 42 శాతం
మనదేశంలో నగర ప్రాంతాలు ముప్పై శాతం ఉంటే, తెలంగాణలో 42 శాతముందన్నారు. ఇది అతివేగంగా అభివృద్ధి చెందుతూ త్వరలో యాభై శాతానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అందుకే, మనవద్ద ఆధునిక నగర ప్లానర్ల అవసరమేర్పడిందని తెలిపారు.