జుమ్లా లేదంటే హమ్లా - కూటమిలో అందరితో కలవలేం : సిన్హాకు మద్దతు - కేటీఆర్..!!
ప్రధాని మోదీ వైఖరి.. ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న విధానాల పైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. తాము కూటమిలోని అన్ని పార్టీలతో కలిసినట్లు కాదని.. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో మాత్రమే మద్దతుగా నిలిచామని స్పష్టం చేసారు. కూటమిలో ఉన్న అన్ని పార్టీలతో కలిసి పని చేస్తున్నట్లు కాదని..పరోక్షంగా కాంగ్రెస్ తో జత కట్టేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ.. విపక్షాల అభ్యర్ధికి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
హద్దు - అదుపు లేకుండా పోయింది
ప్రధాని మోదీ చేస్తున్న పనులకు హద్దు - అదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. గిరిజన మహిళ అభ్యర్ధికి రాష్ట్రపతి సీటు కేటాయించి..నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరించినట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అత్యధిక ధరలు..నిరుద్యోగం..అప్పులు.. ద్రవ్యోల్బణం మోదీ సాధించిన ఘనతగా విమర్శించారు.
దేశాన్ని దివాళా తీసేలా చేసారని..విషం చిమ్మటం మాత్రమే వచ్చని.. విషయం మాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజనుల పైన ప్రేమ ఉంటే. .తాము అసెంబ్లీలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు పైన తీర్మానం చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఉంటే..ఎందుకు అమలు చేయలేనది నిలదీసారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా..మోదీ రాజ్యాంగం అమలు అవుతుందంటూ వ్యాఖ్యానించారు.
మోదీ సమర్ధుడు అయి ఉంటే
ఎన్డీఏకు గిరిజనులకు ప్రేమ ఉంటే.. ఖమ్మంలో ఏడు మండలాలను ఎందుకు పోలవరంలో ముంచారని ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిళను ప్రతిపాదించి రాజకీయం చేస్తామంటే నమ్మరని చెప్పారు. హైదరాబాద్ రావాలని సిన్హాను ఆహ్వానించామని చెప్పారు. బీజేపీ కూటమికి పోటీగా వ్యతిరేకించే కొన్ని పార్టీలు సిన్హా పేరును ప్రతిపాదించారని.. పవార్ - మమతా ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీజేపీ వాళ్లకంటే చిల్లర రాజకీయాలు చేయగలం.. మా సంస్కారం అది కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ వస్తున్న బీజేపీ నేతలు దేశానికి తెలంగాణకు చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు. గుజరాత్ రాష్ట్రంలో మూడేళ్లుగా పని చేసిన వ్యక్తి ప్రధాని అయినా..ఇప్పటికీ కరెంట్ లేదంటే సమర్ధుడా అసమర్ధుడా అని నిలదీసారు. రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము సొంత గ్రామానికి ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారని గుర్తు చేసారు. తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు.. తమకు అభ్యంతరం లేదన్నారు.
తెలంగాణ నుంచే ప్రారంభం
ప్రధాని మోదీ అప్రజాస్వామికంగా 8 రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా .. రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రణలోకి తీసుకొనే ప్రయత్నాలు చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే జరుగుతోందన్నారు. భయ పడి లొంగదీసుకోవటం వారి విధానంగా పేర్కొన్నారు. ఎవరైనా మాట్లాడితే వెంటాడి వేధించటం వారి విధానం గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎన్టీఆర్ ప్రభుత్వం కూలదీస్తే ప్రజలు పోరాడి నెల రోజుల్లో నిలబెట్టారని.. అలాంటి తిరుగుబాటు తెలంగాణ నుంచే మొదలువుతందని హెచ్చరించారు. అయితే జుమ్లా లేదంటే హమ్లా అనే విధంగా దేశంలో బీజేపీ పాలన సాగుతోందంటూ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ నుంచి కేంద్రానికి అందిన నిధుల కంటే.. ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తెలంగాణ కు వచ్చాయని చెబితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ ఢిల్లీ వేదికగా సవాల్ చేసారు.