కేసీఆర్ పనితీరుకు నిదర్శనం: జైట్లీ నుంచి అవార్డు అందుకున్న కేటీఆర్
హైదరాబాద్: దేశంలోనే అత్యంత చిన్న వయసు రాష్ట్రమైనా అనేక రాష్ట్రాలతో పోటీ పడి అవార్డు అందుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతకు, పనితీరుకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎన్బీసీ-టీవీ18 ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇచ్చే లీడర్ అవార్డుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే.
సీఎన్బీసీ-టీవీ18 ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్లో భాగంగా తెలంగాణకు లభించిన అవార్డుని కేంద్రమంత్రి అరుణ్జైట్లీ నుంచి మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మంగళవారం సాయంత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ

ప్రామిస్లను అమలుచేసి గుర్తింపు సంపాదిస్తాం
మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు అందుకోవడం మాత్రమే కాకుండా ఆ ప్రామిస్లను అమలుచేసి గుర్తింపు సంపాదిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన, అతి తక్కువ వయసు కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తున్నదనడానికి, అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నదనడానికి ఈ అవార్డు నిదర్శనమని చెప్పారు.

త్వరలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా
దేశంలోనే త్వరలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు పోటీపడుతూ ప్రజలకు సేవలందించే క్రమంలో ఉన్నాయని అన్నారు. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, అనుభవజ్ఞులు సలహాల మేరకు ప్రభుత్వ విధానాలు ఉండాలని కేసీఆర్ మంత్రులందరికీ చెబుతారని తెలిపారు.

మోస్ట్ ప్రామిసింగ్ అవార్డును అందుకోవడం సంతోషం
కేంద్రమంత్రుల సమక్షంలో మోస్ట్ ప్రామిసింగ్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడానికి సంక్షేమం, సాగునీరు, పరిశ్రమలు.. ఇలా పలురంగాల్లో నూతన పాలసీలు వచ్చాయని, ఇవే తెలంగాణ పురోగామి రాష్ట్రంగా తయారు కావడానికి దోహదం చేశాయని అన్నారు.

జీఎస్టీ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించాం
ప్రజలకు అద్భుతమైన పాలన, అన్నిరంగాల్లోనూ పురోగతి, ప్రభావవంతమైన విధానాలను తీసుకొచ్చామని తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. జీఎస్టీ బిల్లుని శాసనసభలో ఆమోదించామని.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications