అనుమతి లేకపోతే.. నా హోర్డింగ్స్ అయినా తొలగించాల్సిందే! : కేటీఆర్
హైదరాబాద్ : ఆచరణ ఏదైనా.. మార్గ నిర్దేశం చేసే ప్రజా ప్రతినిధులు విషయాన్ని తొలుత తాము ఆచరణలో పెట్టినప్పుడే అధికారులు మరింత క్రియాశీలకంగా పనిచేస్తారు. సరిగ్గా ఇదే తీరును ఫాలో అవుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు 'అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే..! తన హోర్డింగ్స్ అయినా సరే తొలగించాల్సిందేనని' అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా నగరంలో హోర్డింగ్స్ వల్ల తలెత్తుతున్న సమస్యల గురించి జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వర్షాలు, ఈదురు గాలులు వంటివి చోటు చేసుకున్నప్పుడు హోర్డింగ్స్ కూలిపోతుండడం వల్ల నగరంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో హోర్డింగ్స్ పట్ల అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్. అక్రమంగా వెలిసే ప్రతీ బ్యానర్ ను, హోర్డింగ్ ను ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆఖరికి తన పుట్టినరోజుకు సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ అయినా సరే అధికారులు తమ పని తాము చేసుకుపోవాలని సూచించారు కేటీఆర్. ఈ విషయంలో ఎంతటి స్థాయి వ్యక్తులకైనా మినహాయింపులు ఇవ్వవద్దని అధికారులకు మంత్రి కేటీఆర్ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చి దిద్దాలనే క్రమంలో భాగంగానే.. కేటీఆర్ ఇలా నగరానికి సంబంధించిన ప్రతీ సమస్యపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.