యూపీ సీఎం అఖిలేష్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో అఖిలేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఇద్దరు కూడా యువ నాయకులు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారు.
ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధమే ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలను యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సమర్థించారు. ఆ తరువాత మంత్రి కేటీఆర్ స్వయంగా యూపీకి వెళ్లి.. అఖిలేష్ యాదవ్ ను కలిసి వచ్చారు.
వీరి దోస్తానా గురించి ఇప్పుడు చర్చ ఎందుకంటే... ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో అఖిలేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
''రాజకీయాలు పక్కన పెట్టండి. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నేను కలిసిన ముఖ్యమంత్రుల్లో చాలా నిరాడంబరమైన వ్యక్తి.. నచ్చిన వ్యక్తి అఖిలేష్ యాదవేనని చెప్పక తప్పదు..'' అంటూ తన ట్వీట్ లో కేటీఆర్ కామెంట్ చేశారు. అఖిలేష్ ను తాను కలిసినప్పటి ఫొటోలను ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.