మునుగోడులో పోటీ ఎవరి మధ్య..? ఆ ఫోటోతో షాకింగ్ పోస్ట్ పెట్టిన మంత్రి కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగడంతో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ క్రమంలో మునుగోడులో రాజకీయాలు ఊపందుకున్నాయి. మునుగోడు లో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టేలా మాటల తూటాలు సందిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పెరిగిన టెన్షన్
మునుగోడు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 7న విడుదల కానుండగా నామినేషన్ల స్వీకరణకు గడువు అక్టోబర్ 14వ తేదీకి పూర్తి కానుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 15 నుండి ప్రారంభం కానుండగా నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబరు 17 తో ముగుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన నవంబర్ 6వ తేదీన తేలనుంది. దీంతో మునుగోడులో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది.
ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్
ఇక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న అన్ని పార్టీలు మునుగోడు ప్రజల ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజాక్షేత్రంలో మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాము ఏం చేశామో చెబుతూ, పోటీలో ఉన్న కాంగ్రెస్, బిజెపి మునుగోడుకు ఏవిధంగా అన్యాయం చేసాయో చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ప్రశ్నించిన కేటీఆర్
ఈ ట్వీట్ లో కేటీఆర్ మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంలా ఇచ్చిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతిఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథ కు పైసా కూడా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ, ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టిఆర్ఎస్.. ఎవరి మధ్య పోటీ అంటూ కేటీఆర్ ఆశక్తికర ప్రశ్న వేశారు. నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారినుండి కాపాడింది టిఆర్ఎస్ పార్టీ నే అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
నాటి ఫోటో పోస్ట్ చేసి బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్
ఇక ఇదే సమయంలో గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ బాధితుల సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినా నాటి ప్రభుత్వం పరిష్కరించలేదని, ఆనాటి ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యం అని పేర్కొన్న కేటీఆర్, దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగాప్రధానికి మొరపెట్టుకున్నా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి పైసా ఇవ్వలేదు, సమస్య పరిష్కారం కాలేదు అంటూ బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్యను తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంటులో చెప్పిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఈ పోస్ట్ ద్వారా మునుగోడు ఓటర్లను ఆలోచించేలా చేశారు.