హరీష్ తర్వాత మహేందర్ రెడ్డి: కొడంగల్లో రేవంత్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి
కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆయన సొంత ఇలాకాలో చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రేవంత్ అనుచరులు పలువురు టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆయన సొంత ఇలాకాలో చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రేవంత్ అనుచరులు పలువురు టీఆర్ఎస్లో చేరారు.
టీడీపీ పనైపోయిందని తెలుసు, రేవంత్ వెంటే వెళ్లేదాన్ని: బాబుకు ఉమామాధవరెడ్డి షాక్
కొడంగల్కు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి వస్తే.. అనే ఆలోచనతో మంత్రి హరీష్ రావు ముందుకు వెళ్తున్నారు. కొడంగల్పై హరీష్ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి కూడా కొడంగల్పై దృష్టి సారించారు.
కొడంగల్ అధికారులతో మంత్రి సమీక్ష
ఉప ఎన్నికలు వస్తాయన్న నేపథ్యంలో శనివారం కొడంగల్ ప్రాంత మండలాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం తీరు చూస్తే అలాగే ఉందని అంటున్నారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాల అధికారులతో మహేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వారికి మాత్రమే అనుమతి
ఈ సమావేశం ఆసాంతం గది తలుపులు మూయించి గన్మెన్లు, పోలీసులను లోపలికి అధికారులు తప్పా ఎవరూ రాకుండా కాపలాగా పెట్టి నిర్వహించారని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేందర్ రెడ్డి గంటపాటు శాఖల వారీగా సమీక్ష నిర్వహించి ఈ ప్రాంత సమస్యలపై ఆరా తీశారని తెలుస్తోంది.
వేర్వేరుగా భేటీ అయ్యారు
అభివృద్ధి పనులు, మంచి నీటి సరఫరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు సంబంధించి ఆయా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొడంగల్లో పనులు వేగవంతం చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, విద్యుత్ శాఖ, రోడ్లు, భవనాల శాఖల అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రజలకు అవసరమైన పనులు గుర్తించి వెంటనే చేపట్టాలన్నారు.
గతంలో అలా, ఇప్పుడు ఇలా
గతంలో అన్ని శాఖలతో ఒకేసారి సమావేశం నిర్వహించేవారని, ఇప్పుడు అందుకు భిన్నంగా ఒక్కో శాఖ అధికారితో నిర్వహించారని, గ్రామాల వారీగా అభివృద్ధి పనులు గుర్తించాలని ఆదేశించారని అంటున్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు.