ఉక్కు పిడికిలితో సమాధానం చెప్తాం..వారికి మంత్రి కొండా సురేఖ మాస్ వార్నింగ్!
మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ కుర్చీలో కూర్చున్న ఘటనతో పాటు, తన అనుచరులను విడిపించుకోవాలని హుకుం చెలాయించిన సురేఖకు పరాభవం ఎదురైందని వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.
వారిని హెచ్చరించిన మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ కార్యకర్తలు కొండ అనుచరులను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని ఉక్కు పిడికిలితో సమాధానం చెబుతామని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో హెచ్చరించారు. నిన్న రాత్రి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తన రాకను ఉద్దేశించి కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కొండా సురేఖ ఖండించారు. గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఏదో జరిగిందని తప్పుగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్తే తప్పా
కొండ కుటుంబం అంటే గిట్టని కొందరు వ్యక్తులు నీతిమాలిన పనులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రాణప్రదంగా భావించే తమ పైన బురద చల్లడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. తన అనుచరులను గీసుకొండ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, తెలిసి అక్కడికి వెళ్లానని ఇందులో తప్పేముందో చెప్పాలని ప్రశ్నించారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్టేషన్ కు వెళ్లానని చెప్పిన కొండా సురేఖ అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదని వివరించారు.
కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి
తమ అనుచరులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కాగా మంత్రి కొండా సురేఖ వర్సెస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో పెట్టలేదని, ధర్మారం గ్రామంలోరేవూరి ఫ్లెక్సీలను చించి వేశారని రేవూరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవూరి కొండా వర్గీయుల మధ్య ఘర్షణ, దాడులు, కేసులు
రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులకు కొండా వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులపై కొండా వర్గీయులు దాడి చెయ్యటంతో, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడికి పాల్పడిన కొండా సురేఖ వర్గీయులను ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ లో వీరిపైన కేసు నమోదు అయ్యింది. దీంతో కొండా వర్గీయులు ధర్మారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో చేశారు.
ఈ వివాదంపై ఇప్పుడేం మాట్లాడను
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024
ఫ్లెక్సీ వివాదంపై గీసుకొండ పోలీస్ స్టేషన్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ
పోలీస్ స్టేషన్ నుండి బయటకి వచ్చాక నేను ఎలాంటి వాయిస్ ఇవ్వను అంటూ వెళ్లిపోయిన కొండా సురేఖ. https://t.co/LHsE1j1MSC pic.twitter.com/28FJFfJog7
పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ కుర్చీలో కూర్చున్న సురేఖ
ఇక తన అనుచరుల అరెస్ట్ తో హుటాహుటిన నిన్న రాత్రి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మంత్రి కొండా సురేఖ అకారణంగా అరెస్ట్ చేసిన తమ అనుచరులను విడుదల చెయ్యాలని పోలీసులను కోరారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మంత్రి కొండా సురేఖ సీఐ సీట్లో కూర్చోవటం కూడా మరో వివాదంగా మారింది.
కొండా సురేఖతో మాట్లాడిన సీపీ
కొండా సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన క్రమంలో హుటాహుటిన సీపీ అంబర్ కిషోర్ ఝా కూడా గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొండా సురేఖతో మాట్లాడారు. తమ వారిపైన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సీపీ చర్యలు తీసుకుంటామని చెప్పటంతో సురేఖ శాంతించారు. అయితే కొండా సురేఖ తన అనుచరులను విడుదల చెయ్యాలని చెప్పినప్పటికీ వారిమీద నమోదైన కేసుల నేపధ్యంలో పోలీసులు వారిని విడిచిపెట్టలేదు.












Click it and Unblock the Notifications