దీని భావమేమి అన్నా రామన్న: ప్రగతి దూరంగా దత్తత పల్లెలు
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను ప్రగతి బాటలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం గ్రామజ్యోతి. దీన్ని ఆయన 2015 ఆగస్టు 17న అట్టహాసంగా ప్రారంభించారు.
హైదరాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను ప్రగతి బాటలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం గ్రామజ్యోతి. దీన్ని ఆయన 2015 ఆగస్టు 17న అట్టహాసంగా ప్రారంభించారు. తదనుగుణంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
జైనథ్ మండలం గూడ పంచాయతీలోని అనుబంధ గ్రామం రాంపూర్ (టి)ను రాష్ట్ర బీసీ సంక్షేమ, అటవీ పర్యావరణ వ్యవహారాల శాఖ మంత్రి జోగు రామన్న దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా చెత్త, పెంటకుప్పలు ఉండటంతో అపరిశుభ్రత లోపించి పరిసర ప్రాంతం నుంచి పిల్లలకు దుర్గంధం వ్యాపిస్తోంది. పాఠశాలను ఆనుకొని ఉన్న రోడ్డుపైనే బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. నడక సాగించాలంటే విద్యార్థినీ విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత ఇలా
ఇలా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోవడంతో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. చాలాచోట్ల ఇదే తంతు కనిపిస్తున్నది. గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తే నెలకొన్న సమస్యలు తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావ్ దత్తత గ్రామమైన తలమడుగులోని పలు కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టక ఎక్కడ చూసినా అపరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతోంది. ఫలితంగా దుర్వాసనతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావ్ గ్రామంలో పర్యటించి తమ సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
మందగించిన ప్రగతి దాయక పనులు
ఈ పథకంలో భాగంగా లక్ష్యసాధన దిశగా నాలుగేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం తొలుత అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామాలను దత్తత తీసుకున్నారు. తొలుత దత్తత తీసుకున్న గ్రామాలు అభివృద్ధి చెందితే రెండో దిశగా మిగతా పంచాయతీలను అభివృద్ధి పథంలో పరుగులు తీయించాలని ప్రభుత్వ ఉద్దేశం. మొదటి దశలోనే గ్రామాల్లో పురోగతి కనిపించకుండా పోయింది. దీంతో ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే హంసపాదుగా మిగిలింది.
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొదలు తహసీల్దార్లు, ఎంపీడీఓల వరకు దత్తత తీసుకొన్నారు. జిల్లా ఎస్పీతోపాటు ఎస్సైల వరకు దత్తత తీసుకున్న వారు ఉన్నారు. మొదటగా దత్తత తీసుకున్న కొన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక దృష్టితో అభివృద్ధి పరుగులు తీసినా తర్వాత మందగించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తేనే కార్యక్రమ లక్ష్యం నెరవేరుతుందని విమర్శలు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో పంచాయతీలు 244 ఉంటే వాటిలో దత్తత గ్రామాలు 88. ఇక ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు దత్తత తీసుకున్న గ్రామాలు 40 ఉన్నాయి. జిల్లా, మండల స్థాయి పౌర అధికారులు 34, పోలీసు అధికారులు 14 గ్రామాలను దత్తత తీసుకున్నారు.
కమిటీల ప్రాధాన్యం ఇదీ
గ్రామజ్యోతి కార్యక్రమంపై ప్రభుత్వ లక్ష్యం ఘనంగానే ఉన్నా.. అమలు శూన్యం అన్న చందంగా మారాయి. దత్తత తీసుకున్న గ్రామాల్లో సర్పంచ్తో పాటు గ్రామస్థులతో కలిసి ఏడు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేశారు. అధికారులు గ్రామాలకు వచ్చి కమిటీలపై అవగాహన కల్పించక పోవడం, ఇప్పటివరకు అంశాలపై మండలాల్లోనూ గ్రామజ్యోతిపై సమీక్షలు నిర్వహించక పోవడంతో నిర్వీర్యంగా మారాయి. చాలామంది అధికారులు గ్రామాలకు వెళ్లకున్నా వారిని అడిగే వారు లేరు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి వెలుగులు నింపుతుందో? లేదోనన్న సందేహం కలుగుతోంది. గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా చూడడం, మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడంతో పాటు వ్యాధులు దరి చేరకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలి.
బహిరంగ మల విసర్జన నిర్మూలనకు కృషి చేయాలి. వ్యవసాయాధారిత పథకాలు ప్రజలకు వివరించాలి. లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి. ఎరువులు, విత్తనాల సరఫరాల్లో అక్రమాలు లేకుండా చూడాలి. భూసార పరీక్షల నిర్వహణతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. విద్యా కమిటీ ద్వారా ఐదేళ్లు దాటిన పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలి. నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందేలా చూడాలి. వయోజనులంతా అక్షరాస్యులయ్యేలా కృషి చేయాలి. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ నరిగ్గా ఉండేలా కమిటీ చూడాలి. వ్యాధుల భారీన పడిన వారి సమాచారాన్ని కమిటీ సభ్యులు ‘104', ‘108' సర్వీసులకు ఫోన్ చేసి ఆసుపత్రులకు తరలించాలి. పౌష్టికాహారం అందేలా చూడడంతో పాటు వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చేయాలి.
అధికారులతో ద్రుష్టికి తీసుకెళ్లాలి
ఏ కాలంలోనూ నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సహజ వనరుల యాజమాన్య కమిటీ ద్వారా బావులు, బోరుబావుల చుట్టూ నీటి సంరక్షణ పనులు చేపట్టాలి. గ్రామాల్లో మురుగు కాల్వల నిర్మాణం వీధిదీపాల నిర్వహణ, రహదారుల నిర్మాణం, దళితుల వాడల్లో మౌలిక వసతుల కల్పన, తండాలు, గూడేల్లో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టాలి. ఉన్న నిధులతో పనులు చేయించి మిగతా పనులకు ప్రతిపాదనలు పంపేలా చూడాల్సిన బాధ్యత కూడా సంబంధిత కమిటీ సభ్యులదేనని చెప్తారు.
గ్రామ కమిటీలే కీలకం అని ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి జితేందర్రెడ్డి పేర్కొన్నారు. దత్తత గ్రామాల్లో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో నియమించిన కమిటీలే కీలకంగా వ్యవహరించాలని, తరచూ సమావేశమై సమీక్షించుకోవాలని చెప్పారు. సమస్యలేమైనా ఉంటే దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. కానీ గ్రామ కమిటీలతోపాటు దత్తత తీసుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.