ఏపీలో నాకే బిల్లులు రావాలి.. కష్టాల్లో ఉన్నా: పొంగులేటి
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరవెనక సంబంధాలు నడుస్తుంటాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడానికి కేసీఆర్ డబ్బులు పంపించాడంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డబ్బులు సెటిల్ చేశారంటూ భారత రాష్ట్ర సమితి నేతలు ప్రత్యారోపణలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బును ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి.
తాజాగా దీనిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ తో ఎక్కువ సాన్నిహిత్యం ఉండటంవల్ల వైసీపీ గెలుపు కోసం అభ్యర్థులకు డబ్బులు పంపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని జర్నలిస్టు అడిగారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్.. ఏ పార్టీకి తాను డబ్బులు ఇవ్వడంలేదన్నారు. తనవద్ద డబ్బుల్లేవని, తానే కష్టాల్లో ఉన్నానని చెప్పారు. ఏపీ నుంచి తనకు చాలా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తాను కష్టాల్లో ఉంటే డబ్బులు ఎలా ఇస్తానని ప్రశ్నించారు.

సొంత పార్టీ కాంగ్రెస్కు మద్దతిస్తారా? తెలంగాణ ఎన్నికల్లో సపోర్ట్ చేసినందుకు టీడీపీకి మద్దతిస్తారా? సన్నిహితంగా ఉండే జగన్ కు మద్దతిస్తారా? అని అడగ్గా కాంగ్రెస్ పార్టీ తనదని, ఆ పార్టీకే మద్దతిస్తానన్నారు. రాజకీయాలు, స్నేహాలు, బంధుత్వాలు వేరువేరని, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు.
వృత్తి రీత్యా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరి, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నారు. ఏపీ సీఎం జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఎక్కువ.












Click it and Unblock the Notifications