ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం నేనా?: బీజేపీ టచ్లో ఉన్నారన్న ప్రచారంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రంలో పవర్ షట్ డౌన్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. దాన్ని తాము అధికమించామని, ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డామని చెప్పారు. ఈ సందర్భంగా మేడిగడ్డ విషయంలో బాధ్యులను వదలబోమని మంత్రి స్పష్టం చేశారు.
ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచి పెట్టదన్నారు. ధరణిలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి, మంచి వాటిని కొనసాగిస్తామన్నారు. నేడో, రేపో 5 ఎకరాల వారికి రైతుబంధు పూర్తవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పొంగులేటి పేర్కొన్నారు.

విద్యుత్ సమస్య నుంచి బయటపడ్డామని, మంచినీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తలను గత ప్రభుత్వం తీసుకోలేదని.. పైగా తమపై రాళ్లు వేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో చర్చించి జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
బీజేపీకి టచ్లో లేను
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 14 స్థానాలు గెలుస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఒకటో, రెండో వస్తే అదే గొప్ప అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాను బీజేపీ సహా ఏ ఇతర పార్టీలతో టచ్లో లేనని పొంగులేటి స్పష్టం చేశారు. అంతేగాక, పార్లమెంటు ఎన్నికల తర్వాత తానే సీఎం అనడం ఊహాజనితమని మంత్రి పొంగులేటి అన్నారు.
సీఎం కావాలని లేదు
తాను సీఎం కావాలని కోరుకోవడం లేదని, అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రోజూ సీఎంతో ఉంటే సీఎంను అవుతానా? ఆశకూ ఓ హద్దుండాలే అని వ్యాఖ్యానించారు. కాగా, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఎవరినీ అడగడం లేదని, గేట్లు ఎత్తితే వరదేనన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొందరు ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాటం చేసేందుకు సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications