రెండోసారి కరోనా బారినపడ్డ మంత్రి పువ్వాడ అజయ్.. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో...
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి కరోనా బారినపడ్డారు. కరోనా మొదటి వేవ్లోనే కరోనా బారినపడ్డ మంత్రి అజయ్.. తాజాగా రెండో వేవ్లోనూ వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం(ఏప్రిల్ 30) ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. అందులో కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు.
'తేలికపాటి లక్షణాలు ఉండటంతో RT-PCR పరీక్ష నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం పూర్తిగా హోం ఐసోలేషన్లో ఉన్నాను. గడచిన వారం రోజులుగా నన్ను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి.' అని మంత్రి పువ్వాడ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.
ఇటీవల ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల కోసం పువ్వాడ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. సభలు,సమావేశాలు,ర్యాలీలు నిర్వహించడంతో.. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం నిర్వహించిన బహిరంగ సభ కూడా కరోనా వ్యాప్తికి కారణమైందన్న ప్రచారం ఉంది. ఆ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సహా పలువురు నేతలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల ఆయనకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ వైద్య పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇక మంత్రి కేటీఆర్,టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా కరోనా బారినపడి హోం ఐసోలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.
Recommended Video
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 77,930 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,754 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. మరోవైపు కోవిడ్తో చికిత్స పొందుతూ మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 2,312 కు చేరుకుంది. తాజాగా మరో 6,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,62,160కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి.