తెలంగాణాకు ఏం చేశారు? నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డిలపై విరుచుకుపడిన మంత్రి సత్యవతి రాథోడ్!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలు, వారు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరుపై రాష్ట్ర మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కామారెడ్డిలో పర్యటిస్తున్న నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రులు ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితమై పర్యటనలు చేయడం సిగ్గుచేటని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణాలో బీజేపీది మూడో స్థానమే
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని పేర్కొన్న సత్యవతి రాథోడ్, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో బిజెపి స్థానం మూడో స్థానం అని తేల్చి చెప్పారు. ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క కేంద్ర మంత్రి ని పంపించి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా నాలుగు మాటలు మీరు మాట్లాడితే మాకు జరిగే నష్టం ఏమీ లేదని పేర్కొన్న సత్యవతి రాథోడ్ కెసిఆర్ ను రాజకీయంగా బలహీన పరచాలని చూస్తే, ఇబ్బంది పెట్టాలని చూస్తే కుదరదని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి సత్యవతి రాథోడ్
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు అని, ప్రజలు మీ మాటలు నమ్మేది లేదని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి తెలుగు తప్ప ఇతర భాషలు రావని అర్థం కావని సెటైర్లు వేశారు.
బీహార్ సీఎం కేసీఆర్ ను పొగిడిన విషయం అందరూ చూశారని, కానీ దానిని కూడా తప్పుదారి పట్టించేలా కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆయనకు భాష అర్థం కాకనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణాకు రావాల్సిన వాటాలు అడగరేం .. ఏం చేశారని చెప్తారు?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణకు రావలసిన వాటాలు ఎందుకు అడగడం లేదని, ప్రాజెక్టులకు జాతీయ హోదా అడ్డుకుంటున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
ఏపీ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ట్రైబల్ యూనివర్సిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్ భగీరథకు కేంద్ర సాయాన్ని ఇవ్వకుండా మొండిచేయి చూపించారని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
తెలంగాణా కేంద్రానికి ఇస్తున్నది ఎంత? తెలంగాణాకు కేంద్రం ఇస్తున్నది ఎంత?
హైదరాబాద్ కు రావలసిన ఐటీఐఆర్ ను అడ్డుకున్నారని విమర్శించారు. పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి కడుతున్నది ఎంత? మీరు తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నది ఎంత ? అంటూ సత్యవతి రాథోడ్ నిలదీశారు. మన వూరు మన బడి కాన్సెప్ట్ కేంద్రానిది అయితే అది మిగతా రాష్ట్రాలలో ఎందుకు అమలు కావటం లేదో చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్రమంత్రులను ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన, అవసరం తమకు లేదని పేర్కొన్న సత్యవతి రాథోడ్, కేంద్రం రాష్ట్రం పై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో దీనికి సమాధానం చెబుతారని తేల్చి చెప్పారు.