శభాష్.. శ్రీనివాస్ గౌడ్, కరోనాతో రోగి మృతి, అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి, 10 మంది లోపు..
కరోనా వైరస్ అంటే చాలు ఆమడదూరం పారిపోయే పరిస్థితి. ఇక చనిపోతే.. పేగు తెంచుకొని జన్మించిన పిల్లలు కూడా దూరం పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియల్లో పాల్గొంటే మేలు అని వైద్యులు సూచించినా వినిపించుకోవడం లేదు. దీంతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు. కరోనాతో చనిపోయినా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మిగతావారు కూడా హాజరవ్వాలని.. తల్లిదండ్రులు/ పిల్లల అంతిమ సంస్కారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని పాల్గొనాలని సూచించారు.
ప్రజలకు అవగాహన కల్పించడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు. మహబుబ్నగర్లో కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. పీపీఈ కిట్ ధరించారు. మిగతావారు కూడా జాగ్రత్తలు తీసుకొని అంతిమ సంస్కరాలకు హాజరు కావాలని కోరారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కరోనాతో చనిపోతే వారి పిల్లలు మానవత్వం చూపలేని ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆస్పత్రిలోనే డెడ్ బాడీ వదిలేసిన సందర్భాలను గుర్తుచేశారు.
గాంధీ ఆస్పత్రి, వరంగల్లో జరిగిన ఘటనలను శ్రీనివాస్ గౌడ్ ఉదహరించారు. మీడియాలో వచ్చిన కథనాలు బాధ కలిగించాయని చెప్పారు. అందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నానని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పీపీఈ కిట్ ధరించి దహన సంస్కారాలలో పాల్గొన్నానని వివరించారు. పిల్లల ఉన్నతి కోసం పేరంట్స్ త్యాగాలు చేస్తే.. వారు చనిపోయాక దహన సంస్కారాలు చేయకపోవడం దారుణమన్నారు.
కరోనా సోకి చనిపోయిన వారి పట్ల మానవత్వం చూపాలని మంత్రి కోరారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. పీపీఈ కిట్లు ధరించి 10 మందిలోపు అంతిమ సంస్కారాల్లో పాల్గొనొచ్చని గుర్తుచేశారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తతెత్తవని వైద్యులే సూచించారనే అనే అంశాన్ని తెలియజేశారు.