చిరు,నాగ్లతో మరోసారి తలసాని భేటీ.. అధికారులకు కీలక ఆదేశాలు..
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి చిరంజీవి,నాగార్జునలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ భేటీ జరిగింది. సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను భేటీలో మంత్రి ఆదేశించారు. అలాగే సినీ,టీవీ కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. వీటితో పాటు కల్చరల్ సెంటర్,స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైన స్థలాలు సేకరించాలని ఆదేశించారు. ఎఫ్డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.ఇక సినీ షూటింగ్స్కు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
కొద్దిరోజుల క్రితమే మంత్రి తలసాని చిరంజీవి,నాగార్జునలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తలసాని వారితో భేటీ అయ్యారు. హైదరాబాద్ను సినీ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మంత్రి తలసాని ద్వారా అందుకు అవసరమైన చర్యలను కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినీ ప్రముఖులతో వరుస భేటీలు జరుపుతున్నారు.