సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం వద్దు-ఆ విఘ్నేశ్వరుడి దయతో బయటపడ్డాడు: తలసాని
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆ విఘ్నేశ్వరుడి దయ వలన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చిన్న చిన్న గాయాలు తప్ప సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఎమ్మారై స్కాన్ కూడా నార్మల్ అనే వచ్చిందన్నారు. హెల్మెట్,జాకెట్ వాడటం వలన సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని చెప్పారు.అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం(సెప్టెంబర్ 11) పరామర్శించారు.
అసత్య ప్రచారం చేయొద్దు : తలసాని
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని... అసత్య ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా ప్రమాదం తర్వాత 48గంటలు అబ్జర్వేషన్లో ఉంచడం సాధారణ విషయమేనని అన్నారు. దాన్ని కూడా మీడియాలో పెద్ద ఎత్తున చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యులు ఓపెన్గానే చెబుతారని... ఇందులో దాపరికమేమీ ఉండదని అన్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి వస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని చెప్పిన తలసాని.. మెగా ఫ్యాన్స్ అందోళన చెందవద్దని కోరారు.అంతకుముందు,అపోలో ఆస్పత్రి వైద్యుల నుంచి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మంచు లక్ష్మి రియాక్షన్...
నటి మంచు లక్ష్మి కూడా అపోలో ఆస్పత్రికి వచ్చి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్విట్టర్లో ఆమె స్పందించారు. 'సాయి ధరమ్ తేజ్ ఒక బాధ్యాతయుతమైన పౌరుడు. అతను వేగంగా వెళ్లలేదనేది స్పష్టమైంది.రోడ్డుపై మట్టి ఉండటం వల్లే ప్రమాదం జరిగింది. కాబట్టి సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై ఎవరూ రూమర్స్ ప్రచారం చేయవద్దని కోరుతున్నాను.' అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.
ఆర్పీ పట్నాయక్ రియాక్షన్...
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఫేస్బుక్లో స్పందించారు.'సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదేసమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీపై,ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి.ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని నా అభిప్రాయం.' అని పేర్కొన్నారు. అయితే ఆర్పీ పట్నాయక్ అభిప్రాయాన్ని కొంతమంది సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రోజూ ఎంతోమంది సామాన్యులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని... సాయి ధరమ్ తేజ్ బైక్ మాత్రమే ఎందుకు స్కిడ్ అయిందని ప్రశ్నిస్తున్నారు.ఓవర్ స్పీడ్ను కవర్ చేసేందుకు పోలీసులను నిందించడం సబబు కాదంటున్నారు. రోజూ రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది సామాన్యులు చనిపోతుంటారని... సెలబ్రిటీలు అప్పుడెందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ఆర్పీ పట్నాయక్ వాస్తవం మాట్లాడారని కామెంట్ చేస్తున్నారు.
నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం...
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ సాయిధరమ్ తేజ్ కింద పడిపోయారు. ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45, కేబుల్ బ్రిడ్జి మార్గంలోని కోహినూర్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సాయిధరమ్ తేజ్ను స్థానికులు మెడికవర్ ఆస్పత్రికి చేర్చారు. ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కన్ను,ఛాతి,పొట్ట భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో తేజ్ కోలుకుంటున్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని మాదాపూర్ సీఐ తెలిపారు.నిర్లక్ష్యంగా,రాష్ డ్రైవింగ్ చేసినందుకు సాయి ధరమ్ తేజ్పై కేసు నమోదు చేశారు.