మోడీకి మద్దతు, నిధుల సేకరణ: తెరాసలో ఆందోళన, కేసీఆర్కు 'జాగ్రత్త'
నోట్ల రద్దుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు పలకడం అధికార తెరాసలోని పలువురికి ఆందోళన కలిగిస్తున్నదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా ఆయనకు చెప్పారని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నోట్ల రద్దును సమర్షిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ చెప్పినట్లుగా 50 రోజుల తర్వాత సమస్యలు తగ్గకున్నా, ఆడవారి బంగారం జోలికి వెళ్లినా కేంద్రంతో పోరాడుతామని చెప్పారు.
అయితే, కేంద్రం తీరు చూస్తుంటే ఆడవారి బంగారం జోలికి పోయేలా కనిపించడం లేదని కూడా కేసీఆర్ చెప్పారు. ఇక నోట్ల రద్దు అనంతర పరిణామాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంపై పోరాడే అవకాశం రాకపోవచ్చు.
వ్యూహాత్మక వ్యాఖ్యలేనా?
ఆడవారి బంగారం జోలికి పోయినా, మోడీ చెప్పినట్లు 50 రోజుల్లో సమస్యలు తగ్గకున్నా పోరాడుతామని కేసీఆర్ చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆయన ప్రణాళిక ప్రకారమే చెప్పి ఉంటారని అంటున్నారు. ఓ వైపు సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇక ఆడవారి బంగారం జోలికి కేంద్రం వెళ్లదని స్వయంగా కేసీఆరే చెప్పారు. కేసీఆర్ మాటలను చూస్తుంటే ఆయన క్రమంగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.
నోట్ల రద్దుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు
ఇదిలా ఉండగా, నోట్ల రద్దును కేసీఆర్ పూర్తిగా సమర్థించారు. దేశానికి మంచి జరుగుతుందంటే కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మద్దతివ్వాలని, అందుకే నోట్ల రద్దు పైన తాము మోడీకి మద్దతిచ్చామని కేసీఆర్ అసెంబ్లీలో, బయటా చెప్పారు. తెలంగాణను కూడా క్యాష్ లెస్ దిశగా నడిపిస్తామన్నారు. అయితే, పూర్తి క్యాష్ లెస్ సాధ్యం కాదని మాత్రం స్పష్టం చేశారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లోనే క్యాష్ లెస్ లేదని చెప్పారు.
తెరాసలో ఆందోళన
నోట్ల రద్దుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు పలకడం అధికార తెరాసలోని పలువురికి ఆందోళన కలిగిస్తున్నదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా ఆయనకు చెప్పారని తెలుస్తోంది. ఇటీవల నాలుగు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు కేసీఆర్కు 2019 ఎన్నికల కోసమైనా మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారని తెలుస్తోంది.
2019 ఎన్నికలపై..
కేసీఆర్ తెలంగాణను క్యాష్ లెస్గా చేయాలని భావిస్తున్నారు. క్యాష్ లెస్ అంటే.. మొత్తం క్యాష్ లెస్ కాదని, అవసరమైన మేర నగదు అందుబాటులో ఉండాలనేది తెరాసతో పాటు టిడిపి, బిజెపి అభిప్రాయం కూడా. మోడీ నోట్ల రద్దు నేపథ్యంలో.. తెలంగాణను క్యాష్ లెస్గా మార్చేందుకు కేసీఆర్ ఎక్కువ ఉత్సాహం చూపిస్తే మనకు మొదటికే మోసం వస్తుందని మంత్రులు ఆయనకు చెప్పారని తెలుస్తోంది. దీని ప్రభావం 2019 ఎన్నికల పైన కూడా పడుతుందని చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాగున్నా.. ప్రజలు దీనిపై ఆగ్రహంతో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నట్లుగా కనిపిస్తోంద.
నిధుల సేకరణకూ ఇబ్బంది!
మరో ఆసక్తికర విషయమేమంటే క్యాష్ లెస్.. అంటే 2019 ఎన్నికలకు నిధుల సేకరణ కూడా ఇబ్బంది అవుతుందని పలువురు నేతలు కేసీఆర్తో చెప్పారని తెలుస్తోంది. అప్పుడు ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం.
పార్టీలు ఏవైనా..
పార్టీలు ఏవైనా పలువురు నుంచి నిధులు సేకరిస్తాయి. 2014 ఎన్నికల్లో ట్రేడర్స్, రియాల్టర్ల తదితరుల నుంచి డబ్బులు సేకరిస్తారు. ఓటర్లకు పంచుతుంటారు. 2019 ఎన్నికల్లో క్యాష్ లెస్ అయితే ఎవరు కూడా ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు రారని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని పలువురు అధికార పార్టీ నేతలు కేసీఆర్ చెవిలో వేశారని కూడా తెలుస్తోంది.