కూతురి అదృశ్యంతో తండ్రి ఆత్మహత్య: ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి
వరంగల్: ఇటీవల వరంగల్ జిల్లా గుండెంగ శివారు చర్లతండాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత అదృశ్యమైన ఘటనను పోలీసులు ఛేదించారు. కూతురు అదృశ్యం కావడంతో అవమానంగా భావించిన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో కవిత పెండ్లి చేసుకున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.
గూడూరు సీఐ వెంకటేశ్వర్రావు ఆదివారం మీడియా సమావేశంలో ఆ సంఘటన వివరాలను వెల్లడించారు. చర్లతండాకు చెందిన బోడ కవిత గూడూరులోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల అదృశ్యమైనట్లుగా ఆమె తండ్రి బోడ రవి ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో కూతురు అదృశ్యమవడాన్ని అవమానంగా భావించిన తండ్రి రవి ఈ నెల 14న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, జఫర్గఢ్ మండలం గర్నెపల్లిలో కవిత ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం స్థానిక ఎస్సై సతీశ్ తన బృందంతో వెళ్లి బాలిక ఆచూకీని కనుగొన్నారు.
కవితను విచారించగా తనకు తమ తండా పరిధిలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే గర్నెపల్లికి చెందిన దబ్బెట చంద్రయ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని, దీంతో డిసెంబర్ 5న ఇంటి నుంచి వెళ్లిపోయామని తెలిపింది. 10న గర్నెపల్లి గ్రామ పెద్దల సమక్షంలో చంద్రయ్య తనను సంప్రదాయబద్ధంగా వివాహమాడాడని బాలిక వివరించిందని సీఐ తెలిపారు.
హైదరాబాద్లో ఉంటున్న తన తండ్రి రవి ఫోన్లో కోపగించడంతో ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయానని తెలిపిందన్నారు. చంద్రయ్యకు అప్పటికే మరో పెండ్లి జరిగిందని, ఆయన భార్య అనారోగ్యంతో చనిపోవడంతో పెండ్లి చేసుకున్నట్లు కవిత చెప్పిందని తెలిపారు.
మైనర్ను తీసుకెళ్లి పెండ్లి చేసుకున్న చంద్రయ్యపై నిర్బయ, ఫోక్సో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుని కోసం గాలిస్తున్నామని వివరించారు. బాలికను మహబూబాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.