స్నేహితురాలితో కలిసి భద్రాచలం వెళ్లి ఇలా చేశాడు
ఎట్టకేలకు బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. అతన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్ప అప్పగించారు.
హైదరాబాద్: ఎట్టకేలకు బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. అతన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్ప అప్పగించారు. సికింద్రాబాదులోని మల్కాజిగిరిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ సందీప్ రావు, సీఐ ప్రకాష్ తో కలిసి అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లా మలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన వరికుప్పల ఆగమయ్య కుమారుడు గణేష్ (19) ఘట్కేసర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటానని ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లలేదు.
అదే కళాశాలలో చదువుతున్న బాలానగర్కు చెందిన స్నేహితురాలితో కలిసి ఈనెల 6వ తేదీన భద్రాచలం వెళ్లాడు. మర్నాడు వారి వద్ద డబ్బు అయిపోవడంతో విద్యార్థిని వద్ద ఉన్న బంగారు రింగ్ తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించారు. బంగారం దుకాణానికి వెళ్లిన గణేష్ చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో యువతి విసిగిపోయి, ఆందోళన చెంది యువతి హైదరాబాద్ చేరుకుంది.
తాను తిరిగి వచ్చేసరికి స్నేహితురాలు లేకపోవడంతో గణేష్ ఆందోళన చెందాడు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లేందుకు భయపడి తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా నగరంలోని స్నేహితుల వద్దే ఉండిపోయాడు.
తన కుమారుడు కనిపించడం లేదని ఆగమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూకట్పల్లి భరతనగర్లో ఉన్న గణేష్ను బుధవారం అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.