తెలంగాణలో గెలుపెవరిది - ఇదీ లెక్క, తాజా సర్వే సంచలనం..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. ప్రచారంలో అధికార బీఆర్ఎస్ ముందు ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బీజేపీ తమ అభ్యర్దుల తొలి జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో సర్వే సంస్థలు తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన అంచనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వెల్లడైన మరో సర్వే లో తెలంగాణ ఎన్నికలపై ఆసక్తి కర ఫలితాలు వచ్చాయి.
బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్:తెలంగాణ ఎన్నికల వేళ ఈ సారి ప్రధానంగా బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ పోరు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కర్ణాటకలో విజయం తరువాత కాంగ్రెస్ తెలంగాణ పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. పార్టీ హైకమాండ్ నేరుగా తెలంగాణలో పార్టీ నిర్ణయాలను పర్యవేక్షిస్తోంది. ఇదే సమయంలో అభ్యర్దుల ఎంపిక మొదలు..గ్యారంటీ పథకాల ప్రకటన వరకూ అన్నీ తానై వ్యవహరించింది. ఇప్పుడు రాహుల్, ప్రియాంక సైతం తెలంగాణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తాము ప్రకటించిన గ్యారంటీ పథకాలు తమకు అధికారం దగ్గర చేస్తాయనే అంచనాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇదే సమయంలో మూడో సారి వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ లక్ష్యంగా సీఎం కేసీఆర్..గులాబీ నేతలు అడుగులు వేస్తున్నారు.

తాజా సర్వేలో బీఆర్ఎస్ కే పట్టం:తెలంగాణలో ఎన్నికల పైన వరుసగా సర్వే సంస్థల అంచనాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా మరో సర్వే రిపోర్టు వెల్లడైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్కే ఆధిక్యమంటూ మిషన్ చాణక్య సర్వే రిపోర్టు తేల్చింది. ఓట్ షేర్పై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్-44.62 శాతం, కాంగ్రెస్-32.71 శాతం, బీజేపీ-17.6 శాతం, ఇతరులకు 5.04 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.

కాగా, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే కూడా వెల్లడించింది. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్కు 70, కాంగ్రెస్కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. అయితే, తెలంగాణలో ఎన్నికల నాటికి ఈ లెక్కల్లో మార్పు ఉండే అవకాశం ఉందనే అంచనాలు కీలకంగా మారుతున్నాయి.

రాజకీయ ఉత్కంఠ:కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88, కాంగ్రెస్కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ఈ సారి 95-105 మధ్య సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ 80 సీట్లు ఖాయంగా గెలుస్తామని విశ్వాసంతో ఉంది. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అటు బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికల ప్రచారంలోకి దిగుతోంది. ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించటంతో ఈ సారి కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ సంక్షేమమే అస్త్రంగా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, హోరా హోరీ పోరులో చివరికి ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications