కాంగ్రెస్ కు జగ్గారెడ్డి గుడ్ బై - నేడు రాజీనామా..!! గులాబీ గూటికి చేరుతారా- టార్గెట్ రేవంత్..!!
తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే ..సీనియర్ నేత గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే..పార్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మధ్నాహ్నం ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాట చేసారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా ప్రచారం చేయటం పైన ఆయన మనస్థాపానికి గురయ్యారు. దీంతో..ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నదీ వివరిస్తూ..తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ అనుచరుల ప్రచారంతో
తన అనుచరులతో సమావేశమైన జగ్గారెడ్డి.. తాను టీఆర్ఎస్ కోవర్టునంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి గెలిచి ఇలా కోవర్టునన్న ముద్ర వేయించుకోవాల్సిన అవసరమేముందని, పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తాననీ వారికి చెప్పినట్లు సమాచారం.
టీఆర్ఎ్సలో చేరదామన్న ప్రతిపాదననూ సమావేశంలో జగ్గారెడ్డి తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జగ్గారెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతారన్న సంగతి తమకు రెండు నెలల ముందే తెలుసుననీ రేవంత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు తమకు సంకేతాలూ ఉన్నాయని ఆ వర్గాలు అంటున్నాయి.

ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారంటూ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా.. ఎమ్మెల్యే పదవిలో మాత్రం జగ్గారెడ్డి కొనసాగనున్నట్లు చెబుతున్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని ఇప్పటికే జారవిడుచుకున్న కాంగ్రెస్.. మరో ఎమ్మెల్యేను పోగొట్టుకుంటుందా... లేక, జగ్గారెడ్డిని బుజ్జగిస్తుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. కాగా.. జగ్గారెడ్డి రాజీనామా చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆయనకు ఫోన్ చేసి తొందర పడొద్దని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పొసగకపోవడం తోపాటు.. ముక్కుసూటిగా మాట్లాడే తనను కోవర్టుగా చిత్రీకరించారనే మనస్తాపంతోనే జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రేవంత్ పై వ్యతిరేకత
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన జగ్గారెడ్డి.. అధిష్టానం తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడంతో సర్దుకుపోవాలని భావించారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై రేవంత్ వైఖరిని బహిరంగంగానే తప్పుపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ పర్యటించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ను తప్పించాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖలు రాశారు. 2004 నుంచి తొలిసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా జగ్గారెడ్డి ఆ తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2009, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.

కేటీఆర్ తో తాజా వ్యాఖ్యలతో
ఇటీవల మంత్రి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వచ్చిన సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో అప్పుడే ఆయన భవిష్యత్ రాజకీయాల పైన చర్చ మొదలైంది. మా పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేలను మీరే బాగా చూసుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలతో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగిందది. అయితే, తాను ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని..చేరుతానంటే ఎవరైనా అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారు.
కాగా, ఇప్పుడు జగ్గారెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించటంతో ఆయన చెబుతున్నట్లుగా స్వతంత్రంగానే వ్యవహరిస్తారా.. లేక, టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారా అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో ఆయన రాజీనామా చేయకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ఎంత మేర ప్రయత్నిస్తారు.. ఎంత వరకు ఫలిస్తాయి..జగ్గారెడ్డి ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications