గాంధీ నుంచి ప్రతీరోజూ 25 డెడ్ బాడీలు... ఎక్కడా చెప్పట్లేదు... జగ్గారెడ్డి సంచలనం...
ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఓ కౌన్సిలర్ ప్రాణాలను కాపాడుకోలేకపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా స్వయంగా తానే ఎంత ప్రయత్నించినా.. ఎక్కడా ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్స్ దొరకలేదన్నారు. ఐదు రోజులుగా బెడ్స్ కోసం గౌసియా బేగం అనే ఆ కౌన్సిలర్ తిరగని ఆస్పత్రి లేదన్నారు. ఎక్కడికెళ్లినా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోందని... చివరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. అక్కడ ఆక్సిజన్ అందక ఆమె చనిపోయిందని వాపోయారు. ఈ మేరకు జగ్గారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు.

ఎమ్మెల్యే నా పరిస్థితే ఇలా ఉంటే... : జగ్గారెడ్డి
ఒక ఎమ్మెల్యేని అయిన తనకే ఎంత ప్రయత్నించినా బెడ్స్ దొరక్కపోతే... ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో ఎవరికైనా కరోనా వస్తే...ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. అక్కడ ఆక్సిజన్,వెంటిలేటర్ అందించే సౌకర్యం లేదన్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడే తిరుగుతున్న మంత్రి హరీష్ రావు దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. అదృష్టం బాగుండి కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారికే హరీశ్ రావు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని... ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండ్తో రివ్యూ మీటింగ్ నిర్వహించి అవసరమైన మెడికల్ ఏర్పాట్లు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.

గాంధీ నుంచి ప్రతీరోజూ 20-25 డెడ్ బాడీస్..
సంగారెడ్డిలో ప్రజలు సరైన వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతుంటే... ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నట్లు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నీకేమైనా ఆలోచన, పట్టింపు ఉందా అని ప్రభాకర్ రెడ్డిని నిలదీశారు. రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలనా సాగుతోందన్నారు. ఇంగిత జ్ఞానం లేని మంత్రి,ఎంపీలతో ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. రైతు బంధు కింద ఇచ్చే రూ.5వేలకు ఆశపడి ఓట్లు వేసినందుకు... ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు... తానే ఒక సాక్ష్యం,తానే ఒక రుజువు అని చెప్పారు. ఒక కౌన్సిలర్ను కాపాడుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రతీరోజూ 20,25 మృతదేహాలు వెళ్తున్నాయని... కానీ ఏ పేపర్లో,టీవీలో ఆ విషయాలను చెప్పట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పార్టీ కార్యాలయంలో మందులు పంపిణీ చేయడం కాదని... మోదీ దృష్టికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్లాలని జగ్గారెడ్డి అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కేంద్రానికి ఈ విషయం చెప్పాలన్నారు. కౌన్సిలర్ చనిపోయినప్పటి నుంచి తాను మానసికంగా కలత చెందానని చెప్పారు. కేసీఆర్కు కూడా కరోనా సోకినట్లు పుకార్లు వస్తున్నాయన్నారు. కేసీఆర్కో,జగ్గారెడ్డికో,ఐఏఎస్లకు,ఐపీఎస్లకో కరోనా వస్తే ఏమీ కాదని... కానీ సామాన్యులకు కరోనా వస్తేనే బలైపోతున్నారని చెప్పారు.
Recommended Video

ట్యాంక్ బండ్పై నిరసన తెలుపుతానన్న జగ్గారెడ్డి..
రాష్ట్ర సీఎస్ గారు ఇకనైనా కరోనా పరిస్థితులపై సీరియస్గా దృష్టి సారించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి పేషీలోని ఐఏఎస్లంతా మానవత్వంతో వ్యవహరించి రాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం ఇకనైనా కార్యాచరణకు దిగాలని... ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని అన్నారు. లేదంటే... తానే రోడ్డు పైకి వస్తానని... ట్యాంక్ బండ్ పైకి వచ్చి నిరసన తెలుపుతానని చెప్పారు. మంత్రి ఈటలకు మంచి పేరు ఉందని... కానీ ప్రజల ప్రాణాలను కాపాడలేని పదవి ఎందుకని విమర్శించారు. ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications