బాల్కొండ ఎమ్మెల్యే బూతు పురాణం: పోలీసులే ఒకర్నొకరు నెట్టుకున్నారు!
నిజామాబాద్: పుష్కరాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోచంపాడు ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న మెదక్ జిల్లా పోలీసు సిబ్బంది పైన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బుధవారం నాడు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది.
మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహనంలో ఈయన కలిసి ప్రయాణీస్తుండగా కాన్వాయ్కి అడ్డంగా ఓ వాహనం వచ్చింది. దీంతో వాహనం నుంచి దిగిన ఎమ్మెల్యే మెదక్ జిల్లా పోలీసు సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నారని నిలదీశారు.
దీంతో, తాము ఉదయం నుంచి తిండి, తిప్పలు లేకుండా వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నామని ఓ కానిస్టేబుల్ చెప్పాడు. దీంతో, ఎమ్మెల్యేకు ఆగ్రహం వచ్చింది. తనకే ఎదురు చెబుతావా అంటూ పోలీసు సిబ్బంది పైన తిట్ల పురాణం అందుకున్నారు.

కారు సీటు నుంచి లేచి వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. విధుల్లో ఉన్న రంగారెడ్డి, మెదక్ జిల్లా పోలీసులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అతను మరోసారి వారిపై తిట్ల పురాణం అందుకున్నారు.
దీంతో, పోలీసులు మంత్రి కాన్వాయ్కు అడ్డంగా బైఠాయించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్, రంగారెడ్డి పోలీసులను పక్కకు తొలగించేందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తల నడుమ మంత్రి కాన్వాయ్ వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications