బండి సంజయ్.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే మాధవరం సవాల్
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కూకట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెరువుల కబ్జాపై విచారణకు సిద్దమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేలలో ఒకరిని పంపిస్తే బహిరంగంగా ఈ విషయంపై చర్చిద్దామన్నారు.
అంతేగాక, తాను చెరువుల కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని అన్నారు. ఒకవేళ అది నిరూపితం కాకపోతే బండి సంజయ్ రాజీనామాకు సిద్ధమా? అని మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ డివిజన్ లో గురువారం 800 మందికి ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు బీజేపీ పాల్పడుతుందని ఆరోపించారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టును బండి సంజయ్ చదువుతున్నారన్నారు.
ఏవైనా ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు ఎమ్మెల్యే మాధవరం. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే వరకు బీజేపీ పార్టీని విడిచిపెట్టేది లేదని అన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో కూడా పార్లమెంటు నూతన భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే.