గ్రూప్ 1 పరీక్షల్లో భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ విషయం పైన తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలలో భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరొక హాల్ టికెట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
పరీక్ష రాయకుండానే పదిమందికి ఫలితాలు: పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ
అంతేకాదు పరీక్ష రాసింది 21,093 మంది అయితే ఫలితాలు 21 వేల 103 మందికి ఇచ్చారని, పరీక్ష రాయకుండానే పదిమందికి ఫలితాలు ఎలా ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హాల్ టికెట్ పక్కపక్కనే ఉన్న 654 మందికి ఒకే మార్కులు వచ్చాయని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రొఫెసర్ల తో ఎందుకు వీటిని కరెక్షన్ చేయించలేదు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్సీ కోడలు ర్యాంకు పైన అనుమానం
ఇదే సమయంలో పలు అనుమానాలను వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సెంటర్ నెంబర్ 19 లో పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలుకు 206 ర్యాంకు వచ్చిందని, ఎస్టీలలో ఈమెకు ఫస్ట్ ర్యాంకు వచ్చిందని, ఇక ఈ వ్యవహారం పైన తనకు అనుమానం ఉందని ఆయన అన్నారు .
పేపర్ కరెక్షన్ లో తప్పులు.. ఇదే ఉదాహరణ
ఇక పూజిత రెడ్డి అనే అమ్మాయి పరీక్ష రాయగా ఆమెకు 483 మార్కులు వచ్చాయని, ఆమె రీకౌంటింగ్ పెట్టుకుంటే 423 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేస్తే 60 మార్కులు తగ్గాయని, అంత వ్యత్యాసం ఎలా ఉంటుంది అంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పేపర్ కరెక్షన్ లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఈ వ్యవహారంతో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
గ్రూప్ 1 పరీక్షల స్కాం ఫై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి
ఇక గ్రూప్ వన్ పరీక్షల స్కాం పైన జుడిషియల్ ఎంక్వయిరీ లేదా సిబిఐ ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏదైనా పేపర్ లీక్ జరిగితే వెంటనే రద్దు చేశామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిదేమీ చేయడం లేదని పేర్కొన్నారు.
బండి సంజయ్ కు సవాల్
ఒక గ్రూప్ వన్ పరీక్షలలో జరిగిన అవకతవకల పైన బిజెపి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపైన విచారణ జరిపించాలంటూ ఆయన బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఇక ఇదే సమయంలో ఎన్నికలకు ముందు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తనపై కేసులు పెట్టినా భయపడను
విద్యార్థులకు జాబ్ క్యాలెండర్లు చూపించిన రాహుల్ గాంధీ, కోదండరామ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బిజెపి, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని మండిపడ్డారు. ఇక గ్రూప్ వన్ పరీక్షలపైన నేను వ్యాఖ్యలు చేసినందుకు తనను అరెస్టు చేస్తారని, తనపైన కేసు పెడతారని, పొద్దున్నే తన ఇంటికి పోలీసులు వస్తారని, అయినా భయపడేది లేదని పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ తీరు పైన తీవ్రవ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications